అప్పు ఇవ్వలేదని వదిన, మరిది హత్య: ఫోన్ డేటాతో నిందితుల అరెస్ట్
హైదరాబాద్: నగరంలో దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను కాచిగూడ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితులు బంగారు నగల కోసం ఓ మహిళను, ఆమె మరిదిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్పెక్టర్ రాజ్కుమార్, ఎస్సైలు జగదీశ్వర్ రావు, జయన్న ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
బర్కత్పురలో నివసించే కుంచికుర్తి బాల్రాజ్ ఆయన భార్య ఉమారాణి(57) బాగ్లింగంపల్లి సాయిబాబా గుడి వద్ద టిఫిన్ సెంటర్ను నడుపుకుంటున్నారు. బాల్రాజ్ తమ్ముడు, మతిస్థిమితం సరిగాలేని కుంచికుర్తి ప్రభు(42) కూడా వీరితో ఉంటున్నాడు.
కాగా, ఉమారాణి టిఫిన్ సెంటర్కు ఓల్డ్ మలక్పేట న్యూశంకర్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఎంపటి పార్థసారథి అలియాస్ ఇ.బి.రాజు(51), అతని స్నేహితుడు, తార్నాక డెయిరీఫాం ప్రాంతానికి చెందిన పిట్టల యాదయ్య(60) తరచూ వస్తుండేవారు. దీంతో ఉమారాణికి వీరితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం పార్థసారథి తనకు రూ.50వేలు అప్పు కావాలని ఉమారాణిని అడగగా ఆమె నిరాకరించింది.
దీంతో ఆమెపై పగ పెంచుకున్న అతడు ఆమెను ఎలాగైన హతమార్చి, డబ్బు, బంగారు ఆభరణాలు దోచుకోవాలని పథకం వేశాడు. ఈ నేపథ్యంలో మే 16న ఉమారాణి పెళ్లి రోజు కావడంతో యాదగిరిగుట్టకు వెళ్లడానికి ఆటో కావాలని పార్థసారథిని అడిగింది. ఇదే అదునుగా భావించిన పార్థసారథి, అతడి స్నేహితుడు యాదయ్యతో కలిసి అదే రోజు సాయంత్రం ఆటోలో ఉమారాణిని, ఆమె మరిది ప్రభును యాదగిరిగుట్టకు తీసుకెళ్లాడు.
మే 17న స్వామిని దర్శించుకున్న తర్వాత సమీపంలోని మోత్కూర్ మండలం పోడిచెడు గ్రామంలో గంగమ్మ ఆలయం ఉందని, దర్శించుకుంటే మంచి జరుగుతుందన్నాడు. దీంతో ఉమారాణి నమ్మి వారితో బయలు దేరింది. వారు పోడిచెడు-ఆనాజీపురం మధ్య గుట్టలోకి ఉమారాణి, ప్రభును తీసుకెళ్లి కత్తితో పొడిచి, బండరాళ్లతో తలపై మోది దారుణంగా హత్య చేశారు.
అనంతరం ఆమె ఒంటిపై 10 తులాల బంగారు అభరణాలను తీసుకుని పారిపోయారు. కాగా, తన తల్లి, బాబాయి కనిపించడం లేదని ఉమారాణి కుమారుడు విజయ్ మే 26వతేదీన కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
ఉమారాణి సెల్ఫోన్ డేటాలో పార్థసారథితో పలుమార్లు మాట్లాడినట్లు ఉండటంతో అనుమానం వచ్చి, సోమవారం రాత్రి చెన్నెకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న పార్థసారథి, యాదయ్యను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరం అంగీకరించారు. అనంతరం పోలీసులు పోడిచెడుకు వెళ్ళి.. గుట్టలో కుళ్లిపోయిన స్ధితిలో ఉన్న ఉమారాణి, ప్రభు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి వారి నుంచి 7తులాల బంగారు అభరణాలు, ఒక కత్తిని, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.