నిరుపేద మహిళలే వారి టార్గెట్: ఉద్యోగం పేరుతో వ్యభిచారంలోకి, ఇద్దరు అరెస్ట్
అమరావతి: పేదరికంలో మగ్గిపోతున్న మహిళలే వారి టార్గెట్. అలాంటివారు కనపడగానే, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశచూపి, ఆపై వ్యభిచార గృహాలకు తరలిస్తారు. ఇలా ఉద్యోగం పేరిట ఓ మహిళను మోసం చేసి మలేషియాలోని వ్యభిచార గృహంలో అమ్మేసిన ఓ ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
ఆమె ఏడు నెలల పాటు వేశ్యగా మారి వచ్చిన డబ్బుతో అక్కడి వ్యభిచార గృహ నిర్వాహకులకు రూ.1.80 లక్షలు చెల్లించి తిరిగి భారత్కు వచ్చింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యభిచార గుట్టు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎ.రఫీ (41), పాండియ రాజన్ (38)అనే తమిళులను సత్యవేడు మండలం దాసుకుప్పం గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... చెన్నై సమీపంలోని కొడుగ్గుయూర్ ప్రాంతానికి చెందిన రఫీ ఇంటర్ వరకూ చదువుకుని, పది సంవత్సరాల క్రితం ఓ ఫ్లైట్ టికెట్ బుకింగ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. విదేశాలకు వెళ్లేవారికి ప్లైట్ టికెట్లు బుక్ చేయడం, వీసాలు ఇప్పించేవాడు. ఈ క్రమంలోనే అతడికి మలేసియా, సింగపూర్ దేశాల్లోని వ్యభిచార గృహాల నిర్వాహకులతో పరిచయం ఏర్పడింది.
దీంతో మలేషియా, సింగపూర్లో పిల్లల కేర్ టేకర్, టైలర్ ఉద్యోగాలు, ఇంట్లో, దుకాణాల్లో, ఫ్యాక్టరీల్లో పని ఇప్పిస్తామంటూ మహిళలు, యువతులను అక్కడకు పంపడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మలేషియాలోని ధను అనే మహిళకు చెందిన వేశ్య గృహంలో ఇప్పటివరకు పెద్ద సంఖ్యలో మహిళలను విక్రయించినట్టు విచారణలో అంగీకరించాడని తెలిపారు.
విచారణలో ఇచ్చిన సమాచారం మేరకు ఈ అక్రమ రవాణాలో ఏజెంట్గా వ్యవహరిస్తున్న తమిళనాడులోని మదురై జిల్లా సెల్లూరుకు చెందిన పాండియరాజన్ (38) అనే వ్యక్తిని సైతం అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. సింగపూర్, మలేషియా ప్రాంతాల్లో పట్టున్న ఇతను రఫీకి పలువురు మహిళల్ని పరిచయం చేయించి వాళ్లను అక్రమంగా వేశ్య గృహాలకు విక్రయించడంలో తోడ్పడేవాడు.
వీరి మోసానికి గురైన వారిలో ఎక్కువమంది ఉభయ గోదావరి జిల్లాలతోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన మహిళలు, యువతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని తెలిపారు. నిందితుల్ని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు వివరించారు.