ట్రాక్టర్ నడిపి ఏపీ ఇద్దరు మంత్రులు షో, ఢీకొట్టుకున్నాయి!
గుంటూరు: మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ రావులు గురువారం కొంత షో చేయబోగా.. వాహనాలు ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. గుంటూరు రాజధాని ప్రాంతంలో పుల్లారావు, నారాయణలు పర్యటిస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో భూమిని చదును చేసే కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులు వేర్వేరు ట్రాక్టర్ల పైన ఎక్కి వాహనం నడిపారు. అయితే, ఎదురెదురుగా వచ్చిన వీరి రెండు వాహనాలు స్వల్పంగా ఢీకొట్టుకున్నాయి. దీంతో ప్రమాదం తప్పింది.
అంతకుముందు మంత్రి నారాయణ మాట్లాడుతూ... భూసమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చివరి అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. భూసమీకరణపై కోర్టుకు వెళ్లిన రైతులు నరాలోచించుకోవాలన్నారు. భూసమీకరణకు ముందుకు రాకపోతే భూసేకరణ తప్పదన్నారు. భూసేకరణతో రైతులే నష్టపోతారన్నారు.
ఈషా ఫౌండేషన్ కోసం 400ఎకరాలు కేటాయిస్తాం: గంటా
విజయవాడలో ఈషా ఫౌండేషన్ కోసం 400 ఎకరాలు కేటాయిస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావు వెల్లడించారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో గ్రేడింగ్ పద్ధతి తీసుకువస్తామని మంత్రి ప్రకటించారు. ఈ నెల 21న హైదరాబాద్లో యూనివర్శిటీ యాక్టుపై సదస్సు నిర్వహించనున్నామన్నారు.
ప్రయివేటు వర్శిటీ బిల్లుపై కమిటీ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని వివరించారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలలో ఎడ్యుకేషనల్ సిటీల నిర్మాణం కోసం వెయ్యి నుంచి రెండువేల ఎకరాల భూములను కేటాయిస్తామని తెలిపారు.