గొట్టిపాటి రవితో ఇద్దరు మంత్రుల మంతనాలు: క్వారీలపై దాడులు: బలరాం నిర్ణయం తో లింకు..!
ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ లక్ష్యంగా వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. మంత్రులు కొడాలి నాని..పేర్ని ఎమ్మెల్యే గొట్టిపాటితో రెండు దఫాలు మంతనాలు సాగించారని సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా వారు రవితో చర్చించినట్లుగా తెలుస్తోంది. దీంతో..గొట్టిపాటి రవి ఇక వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం రవితో ఇదే అంశం పైన చర్చించినట్లు సమాచారం.
అయితే, రవికి చెందిన గ్రానైట్ క్వారీలపై విజినెల్స్ అధికారులు దాడులు చేయటం ద్వారా ఆయన పైన ఒత్తిడి పెంచుతున్నారనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో చీరాల నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం తో ఇప్పుడు రవి రాజకీయ నిర్ణయం ముడి పడి ఉంది. ఆయన సైతం పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుండటంతో..ఆయన వెళ్లే పార్టీలో మాత్రం తాను కలిసి ఉండలేనని రవి చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
గొట్టిపాటి రవితో మంత్రుల మంతనాలు
2014 ఎన్నికల్లో అద్దంకి నుండి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి ఆ తరువాత కొంత కాలానికి టీడీపీలోకి ఫిరాయించారు. ఆ తరువాత టీడీపీలో స్థానికంగా కరణం బలరాం తో ఆయన వర్గంతో ఇబ్బందులు పడ్డారు. అయితే, చంద్రబాబు అద్దంకి బాధ్యతలు రవికే అప్పగించి..కరణంకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక, తాజా ఎన్నికల్లో తిరిగి అద్దంకి నుండి గొట్టిపాటి రవి టీడీపీ నుండి పోటీ చేసి గెలిచారు.
అయినా..పార్టీకి దూరం కాకపోయినా..అంత యాక్టివ్ గా ఉండటం లేదు. ఇదే సమయంలో హైదరాబాద్ కేంద్రంగా మంత్రులు కొడాలి నాని..పేర్ని నాని మంతనాలు సాగించారు. రవి సైతం తుది నిర్ణయం చెప్పకపోయినా.. ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది.
క్వారీలపైన విజిలెన్స్ దాడులు..
గొట్టిపాటి రవికుమార్కు చెందిన గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ అధికారులు దాడుల వ్యవహారం కలకలం రేపుతోంది. రెండు నెలల వ్యవధిలోనే రవికుమార్ క్వారీలపై దాడులు జరగడం ఇది రెండో సారి. శుక్ర వారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ తనిఖీలు శనివారం అర్ధరాత్రి కూడా కొనసాగాయి. ఆ సమావేశంలో పార్టీ మార్పు పైనే రవికుమార్ తో చర్చించినట్లుగా తెలుస్తోంది.
అయితే, ఇదే సమయంలో ఆయన క్వారీలపై విజిలెన్స్ తనిఖీలు మొదలవడం అనుమానాలను రేకెత్తిస్తోంది. రవి కుమార్ పైన అటు బీజేపీ నుండి ఒత్తిడి ఉండటంతో ఆయన అటు వెళ్లకుండా ఉండేందుకు ఒత్తిడి పెంచుతున్నారని..అందులో భాగమే ఈ విజిలెన్స్ దాడులంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
కరణం బలరాం నిర్ణయం తో లింకు..
ఒకే పార్టీలో ఉన్నా.. గొట్టిపాటి రవి..కరణం బలరాం మధ్య రాజకీయ విభేదాలు..వర్గ పోరు ఉంది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నా..ఎవరి దారి వారిదే. అయితే, తాజాగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఒంగోలులో కరణం బలరాం..ఆయన కుమారుడితో సమావేశమయ్యారు. ఇందులో రాజకీయ ప్రాధాన్యత లేదన చెబుతున్నా.. పార్టీ అధినేత కార్యక్రమాల్లో కరణం బలరాం గతంలో వలే క్రియాశీలకంగా మాత్రం వ్యవహరించటం లేదనే అభిప్రాయం ఉంది. అయితే, కరణం బలరాం బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
అయితే, ఆయన టీడీపీలోనే ఉంటారని సహచరులు చెబుతున్నారు. కరణం పార్టీ మారుతారా లేదా అనే నిర్ణయానికి అనుగుణంగా..ఆయన ఉండే పార్టీలో కాకుండా మరో పార్టీలో చేరాలనేది రవి ఆలోచనగా మంత్రులతో చర్చల సమయంలో తేల్చినట్లు సమాచారం.
వంశీతో పాటుగా అసెంబ్లీ లోగా..
అయితే, వైసీపీ మాత్రం ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరింత తమతో టచ్ లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు మరింత సమయం ఇవ్వకుండా..తమ వైపు ఉండేలా ఫిక్స్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే వంశీ వైసీపీ లో రాక ఖాయం కావటంతో..రవి నిర్ణయం పైన ఒత్తిడి పెరుగుతోంది. అందులో భాగంగానే క్వారీల పైన దాడులంటూ ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం లోగానే మరో ముగ్గురు వంశీ బాట పడుతారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో తొలుత తమతో టచ్ లో ఉండి..ఇప్పుడు బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్న గంటా వ్యవహరంతో..ఇక ఇటువంటి అంశాల్లో ఆలస్యం చేయకుండా నిర్ణయాలు ఉండాలని వైసీపీ భావిస్తోంది. మరి..గొట్టిపాటి రవి ఫైనల్ గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.