రంగంలోకి చిరు: భేటీలో ఇద్దరు మంత్రులు, ఫలించేనా?
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు నేపథ్యంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వేర్వేరుగా శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో పలువురు సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న వారి లిస్టులో ప్రధానంగా మంత్రి గంటా శ్రీనివాస రావు పేరు వినిపిస్తోంది. ఆయనతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు టిడిపి వైపు వెళ్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం సూచనల మేరకు చిరంజీవి రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీలోనే కొనసాగాలని వారిని చిరు బుజ్జగిస్తున్నారట.
తన వర్గానికి చెందిన నేతలు ఎవరు గోడ దూకకుండా తీసుకునే చర్యల్లో భాగంగానే చిరంజీవి తన నివాసంలో భేటీ అయ్యారంటున్నారు. చిరంజీవితో జరిగిన భేటీలో మంత్రులు గంటా శ్రీనివాస రావు, సి రామచంద్రయ్య, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెసు పార్టీ పని సీమాంధ్రలో అయిపోయిందని పలువురు ఈ భేటీలో అభిప్రాయపడ్డారట.
వారు దూరం
తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ పిఅర్పీ ఎమ్మెల్యేలు ఇద్దరు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాటసాని రామిరెడ్డిలు ఈ భేటీకి దూరంగా ఉన్నారు. కాగా, చిరంజీవి రంగంలోకి దిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదని మరికొందరు అంటున్నారు.
తెలంగాణ నేతల భేటీ
మరోవైపు తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నాయకులు భేటీ అయ్యారు. కాంగ్రెసు, టిడిపి, తెరాస, బిజెపి ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. ముసాయిదా బిల్లులోని అభ్యంతరాలపై తెరాస ఈ సందర్భంగా నివేదిక ఇచ్చింది. డ్రాఫ్ట్లోని అభ్యంతరాల పైన చర్చ జరగకుంటే ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు చేసి ఆ ప్రతిని సభాపతికి ఇచ్చే విషయంపై చర్చిస్తున్నారు.