స్మార్ట్ఫోన్లో అశ్లీల వీడియోలు చూసి..: నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారం
తూర్పుగోదావరి: కాకినాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాలి పటాలు ఎగరవేద్దామంటూ తీసుకెళ్లి అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ చిన్నారి తీవ్రగాయాలపాలైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాలి పటాలు ఎగురవేసేందుకు రావాలంటూ ఇద్దరు మైనర్లు బాలుగురు నాలుగేళ్ల చిన్నారిని తీసుకెళ్లారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆ బాలికను ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయారు.
కాగా, ఆ చిన్నారికి స్నానం చేయిస్తుండగా.. ఆమె తల్లి ఏం జరిగిందని ప్రశ్నిస్తుండటంతో ఆమె జరిగిన విషయం చెప్పింది. దీంతో చిన్నారి తల్లి కాకినాడ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులైన ఇద్దరు బాలురను అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బాధిత చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. కాగా, నిందితులిద్దరూ నిత్యం ఆన్లైన్లో అశ్లీల వీడియోలు చూసేవారని పోలీసులు తెలిపారు. ఈ ప్రభావంతోనే చిన్నారిపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పారు. పిల్లలు స్మార్ట్ ఫోన్లలో ఏం చేస్తున్నారు? ఎలాంటి వీడియోలు చూస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని, చెడు సమాచారం చూస్తుంటే వెంటనే వారిని హెచ్చరించాలని సూచించారు. మైనర్లే ఇలాంటి దారుణానికి తెగబడటం స్థానికంగా కలకలం రేపింది.