పోలవరంలో జగన్ పార్టీ ఎమ్మెల్యే గ్రామం మునక
అందులో ఒకరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, మరొకరు సీపీఎం ఎమ్మెల్యేలు ఉన్నారు. సదరు ఎమ్మెల్యేల స్వగ్రామాలు ముంపు ప్రాంతంలో ఉండటంతో వీరు స్థానికేతర సమస్యను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి.
ఖమ్మం జిల్లాకు చెందిన సున్నం రాజయ్య భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సీపీఎం నేత. ఇప్పటి వరకు ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన పుట్టి పెరిగింది ముంపు మండలం ఉన్న వీఆర్ పురం(వరరామచంద్రాపురం)లోని సున్నంవారి గూడెం. ఆయనకు సొంతూరిలో పక్కా ఇల్లు ఉంది. ఈ గ్రామంలో సుమారు 500 మంది జనాభా ఉంటుంది. ప్రస్తుతం ఆ గ్రామం అంతా పోలవరం ముంపులోకి చేరిపోనుంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సొంత గ్రామం ముంపు మండలం వేలేరుపాడు. ఈ మండలంలోని తిరుమలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నాయికట్ట ఆయన స్వగ్రామం. అక్కడ ఆయనకు ఇంటి స్థలం ఉంది. ఈ గ్రామం కూడా ముంపులోకి చేరిపోనుంది. ఈ గ్రామ జనాభా సుమారు 400.