ఇఫ్లూ విద్యార్థినిపై అత్యాచార ఘటన: మరో ఇద్దరి అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఇఫ్లూ విశ్వవిద్యాలయంలో ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటనలో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం నిందితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఎర్రగడ్డ ఆస్పత్రిలో సైతం వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. నిందితులపై ఎలాంటి దాడులు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నవంబర్ 1న ఇఫ్లూ యూనివర్సిటీలో యువతిపై గ్యాంగ్ రేప్ జరుగగా బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంటనే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఉస్మానియా యూనివర్సిటీలోని ఇఫ్లూలో ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులను పోలీసులు ఇటీవల కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఆ తర్వాత వారిని జుడీషియల్ రిమాండ్కు తరలించారు. కాగా, తాము విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డామని నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.
అయితే బాధితురాలు తమ స్నేహితురాలు కావడంతో రేప్ తర్వాత తాము పరిస్థితిని సద్దుమణిగేలా చూడగలమని అనుకున్నామని నిందితులు చెప్పారు. ‘నిందితులు నితిన్ సోలసముద్రం, కె రాజ్ సింహా(24)లను పోలీసులు కోర్టు ఎదుట హాజరపర్చాం. తర్వాత వారిని 14రోజులపాటు జుడిషియల్ రిమాండ్కు తరలించాం' అని ఓయు పోలీస్ ఇన్స్పెక్టర్ వి అశోక్ రెడ్డి అప్పట్లో తెలిపారు.
అప్పట్లో అత్యాచార ఘటనపై విద్యార్థులు ఆందోళనలకు దిగారు. తనతో చదువుతున్న నలుగురు విద్యార్థులు తనకు మత్తు మందు ఇచ్చి తనపై అత్యాచారం చేశారని అప్పట్లో ఓ విద్యార్థిని పోలీసులకు పిర్యాదు చేసింది.