ఏపీలో 21: ఆయన కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్: బయటి వ్యక్తులు కాకపోవడం..సేఫ్!
విశాఖపట్నం: భయానక కరోనా వైరస్ జాడలు రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. కొత్తగా నమోదైన ఈ రెండు కేసులు కూడా ఇదివరకే కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి కుటుంబ సభ్యులే. బయటి వ్యక్తులు కాకపోవడం కొద్దిగా ఊరట కలిగించే అంశం.
జగన్ సర్కార్ ముందుజాగ్రత్త: యడ్డీకి ఫోన్..కర్ణాటక సరిహద్దుల్లో ఐసొలేషన్: ఐఎఎస్లకు బాధ్యతలు.. !
విశాఖలోనే కొత్త కేసులు
కొత్తగా నమోదైన ఈ రెండు కరోనా పాజిటివ్ కేసులు కూడా విశాఖపట్నంలోనే నమోదు అయ్యాయి. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నుంచి స్వస్థలానికి వచ్చిన ఓ యువకుడికి ఇదివరకే కరోనా వైరస్ సోకింది. ఆయన కుటుంబ సభ్యులకు రక్త పరీక్షలను నిర్వహించగా.. ఇద్దరికి వైరస్ సోకినట్లు తేలింది. దీనితో వారిని విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (విమ్స్)లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రానికి తరలించారు. దీనితో ఆ యువకుడి కుటుంబ సభ్యుల్లో మొత్తం ముగ్గురు కరోనా వైరస్ బారినపడినట్టయింది.
హోమ్ క్వారంటైన్లో ఉన్న సమయంలో..
బర్మింగ్హామ్ నుంచి ఈ నెల 17వ తేదీన స్వస్థలానికి చేరుకున్న ఆ యువకుడు కొద్దిరోజుల పాటు హోమ్ క్వారంటైన్లో గడిపారు. ఆ సమయంలోనే ఆయన నుంచి కుటుంబ సభ్యులకు వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువకుడితో పాటు వైరస్ సోకిన ముగ్గురిని వేర్వేరు ఐసొలేషన్ కేంద్రాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉన్నాయని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై ఓ హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు.
విశాఖలోనే ఆరు కేసులు..
కొత్తగా నమోదైన ఈ రెండు కేసులతో ఒక్క విశాఖపట్నంలోనే కరోనా వైరస్ పాజటివ్గా తేలిన కేసుల సంఖ్య ఆరుకు పెరిగినట్టయింది. ఈ ఆరుమంది పేషెంట్లలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం కొద్దిగా ఊరట కలిగించే విషయమని అధికారులు చెబుతున్నారు. బయటి వ్యక్తులెవరూ ఈ వైరస్ బారిన పడకపోవడం వల్ల పేషెంట్ల ట్రాకింగ్ సులభతరమౌతోందని అంటున్నారు. బర్మింగ్హామ్ నుంచి వచ్చిన యువకుడి సమాచారాన్ని వార్డు వలంటీర్లు సత్వరమే పసిగట్టగలిగారని చెబుతున్నారు.
Recommended Video
జిల్లాలవారీగా కరోనా పేషెంట్ల సంఖ్య ఇదీ..
రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్గా తేలిని వారి సంఖ్య ప్రస్తుతం 21కి చేరింది. విశాఖపట్నం-6, కృష్ణా-4, గుంటూరు-4, ప్రకాశం-3 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కరోనా బారిన పడిన నెల్లూరు యువకుడు పూర్తిగా కోలుకున్నాడు. కొద్దిరోజుల కిందటే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.