ఏపీలో మరో రెండు పాజిటివ్: రెండూ తూర్పు గోదావరి జిల్లాలోనే..: 23కు చేరిన కరోనా కేసులు
కాకినాడ: భయానక కరోనా వైరస్ క్రమంగా కోరలు చాస్తున్నట్లు కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అధికార యంత్రాంగాన్ని ఉలిక్కి పడేలా చేసింది. విశాఖపట్నంలో ఒకేసారి రెండు కేసులు పాజిటివ్గా తేలిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో ఇద్దరిలో ఈ భయానక వైరస్ జాడలు కనిపించాయి. దీనితో ఇప్పటిదాకా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 23కు చేరుకుంది.
కొత్తగా నమోదైన ఈ రెండు పాజిటివ్ కేసులు కూడా తూర్పు గోదావరి జిల్లాలోనివే. కాకినాడ, రాజమహేంద్రవరంలల్లో కొత్త కేసులు నమోదు అయ్యాయి. కాకినాడకు చెందిన 49 సంవత్సరాల వ్యక్తికి కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. రాజమహేంద్రవరంలో 72 సంవత్సరాల వయోవృద్ధుడు కూడా ఈ మహమ్మారి బారిన పడినట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ధారించారు.
ఏపీలో మరో రెండు పాజిటివ్: రెండూ తూర్పు గోదావరి జిల్లాలోనే pic.twitter.com/txPZ3sSx1U
— Oneindia Telugu (@oneindiatelugu) March 30, 2020
ప్రస్తుతం ఆ ఇద్దరి ట్రావెల్ హిస్టరీపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాధితులు గానీ, వారి కుటుంబ సభ్యులు గానీ లేక బంధుమిత్రుల్లో ఎవరైనా విదేశాల నుంచి వచ్చి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్దారించారు. ఇదివరకు రాజమహేంద్రవరంలోనే ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఆ వ్యక్తి లండన్ నుంచి స్వస్థలానికి చేరుకున్నాడు. అతని ద్వారా వైరస్ కొత్తగా సంక్రమించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అధికారులు దీన్ని ఇంకా ధృవీకరించలేదు. కొత్తగా వైరస్ బారిన పడిన ఇద్దరి ట్రావెల్ హిస్టరీ గురించి అన్వేషిస్తున్నారు.
తాజాగా నమోదైన ఈ రెండింటితో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్గా తేలిన వారి సంఖ్య 23కు చేరింది. ఆదివారం రాత్రి వరకూ 21గా ఉన్న ఈ సంఖ్య ఒకేసారి 23కు పెరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ కేసులు మూడుకు చేరాయి. విశాఖపట్నం-6, కృష్ణా-4, గుంటూరు-4, ప్రకాశం-3 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కరోనా బారిన పడిన నెల్లూరు యువకుడు పూర్తిగా కోలుకున్నాడు. కొద్దిరోజుల కిందటే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.