రెండు పిసిసిలపై డిగ్గీ: తెరాసతో పొత్తు, విలీనం పైనా ఆరా
సమాచారం ప్రకారం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రాంత నేతల మాటలను, మరో ప్రాంతం నేతలు వినే పరిస్థితి లేదని, దీని వల్ల పార్టీకి నష్టం చేకూరుతున్నదని దిగ్విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సీమాంధ్రకు చెందినవారు కావడంతో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని చెప్పారు.
అదే రెండు పిసిసిలు ఏర్పాటు చేస్తే తెలంగాణ ఇచ్చిన ఉత్సాహంతో ఆ ప్రాంత నేతలు ప్రజల వద్దకు వెళ్లగలుగుతారని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో దిగ్విజయ్ను కలిసినప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి కూడా ఇదే అంశం లేవనెత్తారు.
రెండు పిసిసిలు ఏర్పాటు చేసే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు గురువారం అసెంబ్లీ లాబీల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు కూడా వ్యాఖ్యానించారట. మరోవైపు రాష్ట్రంలో రెండు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు కోరుతున్న విషయం తెలిసిందే.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు మంచిదా లేక విలీనం చేసుకోవడం మంచిదా అనే ఆలోచనపై కూడా పలువురు నేతలను డిగ్గీ అడిగినట్లుగా సమాచారం. రాబోయే ఎన్నికల్లో తెరాసతో సీట్ల సర్దుబాటు లేదా విలీనం.. ఈ రెండింటిలో ఏది ఉత్తమమో చెప్పాలని తెలంగాణ కాంగ్రెసు నేతలను ప్రశ్నించారు.