జరభద్రం: కర్నూలు అనంతపురంలో స్వైన్ ఫ్లూ రాకాసి..ఇద్దరు మృతి
అనంతపురం: మొన్న తిరుపతి నిన్న హైదరాబాద్ నేడు అనంతపూర్... స్వైన్ ఫ్లూ మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు నిద్ర పట్టకుండా చేస్తోంది. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. మొత్తం 10 కేసులు నమోదు కాగా అందులో ఇద్దరు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో అనంతపురం కర్నూలు జిల్లాలో స్వైన్ ఫ్లూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా ఆరుగురు పేషెంట్లు స్వైన్ ఫ్లూ బారిన పడి మృతి చెందినట్లు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
హైదరాబాద్ను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ...ఐదుగురు మృతి
సోమవారం ఓ గర్భిణి స్త్రీ మరియు ఓ వృద్ధురాలు స్వైన్ ఫ్లూ బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందారు. స్వైన్ ఫ్లూ సోకిన వారికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.ఇప్పటి వరకు 13 మందికి స్వైన్ ఫ్లూ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించాయని జిల్లా అదనపు ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ సరస్వతి దేవి తెలిపారు. ఇక స్వైన్ ఫ్లూ వ్యాధి పాకుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
పొరుగు జిల్లాలు అయిన అనంతపురం, కర్నూలు కడప జిల్లాలోని మండల స్థాయిలో సిబ్బందిని అలర్ట్ చేశారు. స్వైన్ ఫ్లూ రాకుండా ఆయా గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. స్వైన్ ఫ్లూ విస్తరించకుండా గ్రామాల్లో నివసించే ప్రజలకు అవగాహన తీసుకురావాల్సిందిగా సిబ్బందికి సూచించారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వ్యక్తులలో కొందరిని జిల్లా ఏరియా ఆస్పత్రులకు తరలిస్తుండగా మరికొందరిని బెంగళూరు, బళ్లారిలోని హాస్పిటల్స్కు తరలిస్తున్నారు.
ఈ మహమ్మారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు పిలుపునిచ్చారు. జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.