కృష్ణా జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం, గ్రామానికి రాకపోకలు బంద్
విజయవాడ: కృష్ణా జిల్లాలో స్వైన్ ఫ్లూ భయంతో ఓ గ్రామాన్ని వెలివేసిన దారుణ సంఘటన వెలుగు చూసింది. ఇటీవల కోడూరు మండలం చింతకోళ్ల గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు. దీనికి స్వైన్ ఫ్లూ కారణమని ప్రచారం జరిగింది.
స్వైన్ ఫ్లూ వైరస్ గ్రామం అంతటా వ్యాపించిందని కూడా పుకార్లు వచ్చాయి. దీంతో గ్రామంలోని ప్రయివేటు స్కూళ్లు విద్యార్థులకు అనధికారికంగా సెలవులు ప్రకటించాయి. చింతకొల్లులో అధికారులు పర్యటించారు. కలెక్టర్ లక్ష్మీకాంతం.. ఆర్డీవో, పలువురు అధికారులను గ్రామానికి పంపించారు.
మరో విషయం ఏమంటే, చింతకోళ్ల గ్రామంలో స్వైన్ ఫ్లూ కలకలం చెలరేగడంతో చుట్టుపక్కల గ్రామాలు అక్కడికి రాకపోకలు మానేశాయి. ఆ గ్రామస్తులను రానీయడం లేదు. చింతకొళ్లు నుంచి పక్క ఊళ్లకు వెళ్ళి చదువుకునే విద్యార్థులను కూడా తమ గ్రామాలు లేదా గ్రామాల్లోని పాఠశాలలకు నిషేధించారని తెలుస్తోంది.
చింతకోళ్ల గ్రామానికి చెందిన నాంచారయ్య మూడు రోజుల క్రితం మృతి చెందారు. అంతకుముందు అదే గ్రామానికి చెందిన మరియమ్మ కూడా అంతుచిక్కని వ్యాధితో మృతి చెందింది. దీంతో ఊళ్లో స్వైన్ ఫ్లూ కలకలం చెలరేగింది. భయంతో ఇరుగుపొరుగు గ్రామాల చింతకోళ్ల గ్రామానికి రావడం లేదు.
స్వైన్ ఫ్లూ కలకలం నేపథ్యంలో చింతకొళ్లు గ్రామస్తులు పక్క గ్రామాలకు మంచి నీటి కోసం వెళ్తే కూడా పొలిమేర నుంచే పంపించి వేస్తున్నారు. చింతకోళ్ల గ్రామానికి వెళ్లవద్దని చాలా ప్రాంతాల్లో మైకుల్లో చాటింపులు వేశారు.