మోదీ పై పోటీకి తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రుల కూడా రెడీ ! వారణాసి బరిలో ఇద్దరు ప్రకాశం జిల్లా వాసుల
ప్రధాని మోదీ పై పోటీ చేయటానికి తెలుగు రైతులు పోటీ పడుతున్నారు. నిజామాబాద్ పసుపు రైతుల బాటలోనే ఏపి లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు సైతం మోదీ పై పోటీకి దిగుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే నామినేషన్లను సైతం దాఖలు చేసారు. దీంతో..ఇప్పుడు వీరి వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మోదీకి పోటీగా ఇద్దరు ఆంధ్రులు..
సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం తెలుగు రైతులు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఏకంగా ప్రధాని మోదీపైనే ఎన్నికల్లో పోటీ చేసి తమ నిరసన జాతీయ స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏపి లోని ప్రకాశం జిల్లాకు చెందిన స్థానికులు ఇప్పుడు ఇటువంటి నిర్ణయమే తీసుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు అవశ్యకతను చాటిచెప్పుతూ ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ బరిలో నిలుస్తున్న వారాణాసి లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. పామూరు మండలం బొట్లగూడూరు గ్రామానికి చెందిన వడ్డే శ్రీనివాసులు, కొల్లూరు రవికిరణ్ శర్మలు శుక్రవారం వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. వీరికి మద్దతు తెలిపేందుకు పలువురు స్థానికులు కూడా వారణాసికి వెళ్లారు.
మోదీకి ప్రకాశం వాసుల నిరసన
ప్రధాని మోదీ రెండో సారి వారణాసి నుండి పోటీ చేస్తున్నారు. శుక్రవారం నామినేషన్ వేయటానికి ముందుగా కాళభైరవ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తరువాత వారణాసి కలెక్టరేట్కు వెళ్లారు. ఆ సమయంలో కాళభైరవ ఆలయం వద్ద వెలిగొండ పోరాట సాధన సమితి సభ్యులు నిరసన తెలిపారు. కనిగిరి ప్రాంతంలోని ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కలగాలంటే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి తీరాలన్నారు. ఈ సమస్యను జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు వారణాసి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా నుండి వెళ్లిన స్థానికులు మోదీ ఆలయం వద్దకు రాగానే తమ డిమాండ్లను నినదించారు.
ఇప్పటికే చేరిన నిజామాబాద్ రైతులు..
ఇక, మరోవైపు మోదీపై పోటీ చేయడానికి సిద్దమైన నిజామాబాద్ పసుపు రైతులు కూడా వారణాసి బయలుదేరి వెళ్లారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా పోటీలో ఉంటామని నిజామాబాద్ రైతులు పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి భారీ సంఖ్యలో రైతులు బరిలోకి దిగారు. ముఖ్యమంత్రి కుమార్తె..సిట్టింగ్ ఎంపీగా ఉన్న . కవిత బరిలో నిలిచిన నిజామాబాద్ స్థానం నుంచి మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీ చేసారు. ఇక, ఇప్పుడు తెలుగు రైతులు ఏకంగా ప్రధాని మోదీ పైన పోటీకి దిగటం దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైంది.