రాళ్ల దాడి: పోలీస్ కాల్పుల్లో ఇద్దరు ఎర్ర కూలీలు మృతి
కడప: జిల్లాలో బుధవారం ఉదయం పోలీసులు, తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఎర్ర చందనం కూలీలు మృతి చెందినట్లు సమాచారం.
పోలీసుల కథనం ప్రకారం.. ఓబులవారిపల్లె మండలం గాదెల అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో 100 మంది ఎర్రచందనం కూలీలు వారికి ఎదురుపడటంతో కూలీలను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు.
అయితే రెచ్చిపోయిన కూలీలు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడటంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. దీంతో అక్కడ్నుంచి వంద మంది ఎర్ర చందనం కూలీలు పరారైనట్లు పోలీసులు తెలిపారు.
ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడితో పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు ఎర్ర చందనం స్మగ్లింగ్ కేంద్రాలుగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.