పోలీసుల కళ్లుగప్పి...పరారైన రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీలు
రాజమండ్రి: పట్టణంలోని సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారయ్యారు. ఖైదీలను జైలు నుంచి మరో చోటికి తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు.
లావేటి తల్లిబాబు, నూకరాజు అనే ఇద్దరు ఖైదీలను కేసు విచారణ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నర్సీపట్నం తీసుకెళ్లడానికి పోలీసులు నిశ్చయించారు. ఇందులో భాగంగా బుధవారం వాహనం సిద్దం చేసి వారిద్దరితో నర్సీపట్నం బయల్దేరారు. అయితే దారిమధ్యలోనే ఇద్దరు రిమాండ్ ఖైదీలు ఒక్కసారిగా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. ఈ విషయమై రాజానగరం పీఎస్లో కేసు నమోదు అయింది.
అయితే జరిగిన ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులపై ఎటువంటి దాడికి పాల్పడకుండా...ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఖైదీలు ఎలా పారిపోగలిగారనే విషయం సందేహాలకు తావిస్తోంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకోవడంతో లోతుగా విచారణ జరిపితే అన్ని విషయాలు బైటకు వస్తాయని భావిస్తున్నారు. అయితే పారిపోయిన ఖైదీలు తీవ్ర నేరారోపణలతో జైలుకు వచ్చినందున వారిని పట్టుకునే విషయమై పోలీసులు తీవ్ర స్థాయిలో గాలింపు జరుపుతున్నట్లు తెలిసింది.