పోస్టింగ్ కోసం సోమేష్ కుమార్ ఎదురు చూస్తోన్న వేళ- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేష్ కుమార్.. ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్నారు. ఈ నెల 12వ తేదీ నాడే ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా మర్యాదపూరకంగా సమావేశం అయ్యారు. సోమేష్ కుమార్ రిపోర్ట్ చేయడమైతే చేశారు గానీ.. ఆయనకు ప్రభుత్వం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. వెయిటింగ్ లో ఉంచింది.
తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో అత్యున్నత పదవిలో పని చేసినందు వల్ల ఆయనకు అదే స్థాయి హోదాను అప్పగించాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయనను అపాయింట్ చేయాలని భావిస్తోంది. ఈ హోదాలో ఉన్న పోస్టులు ఏవీ పెద్దగా ఖాళీగా ఉండట్లేదు.
దాదాపు అన్ని శాఖల్లోనూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టులు భర్తీగా ఉన్నాయి. అదే సమయంలో సోమేష్ కుమార్ కు వాణిజ్య పన్నుల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య తాజగా ఏపీ ప్రభుత్వం ఇద్దరు సీనియర్ ఐఎఎస్ అధికారులకు స్థానచలనం కలిగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ముఖ్య కార్యదర్శి పని చేస్తోన్న గోపాల కృష్ణ ద్వివేదీని బదిలీ చేసింది. ఆయనను వ్యవసాయ శాఖకు ట్రాన్స్ఫర్ చేసింది. ద్వివేదికి అదనంగా ఉన్న గనుల శాఖ యధాతథంగా కొనసాగించింది. మరో సీనియర్ ఐఎఎస్ అధికారి బుడితి రాజశేఖర్ ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఇక సోమేష్ కుమార్ కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయనను వెయిటింగ్ లోనే ఉంచింది.
1989 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ అధికారి.. సోమేష్ కుమార్. ఆయన స్వరాష్ట్రం బిహార్. ఏపీ విభజన సమయంలో సోమేష్ కుమార్ తెలంగాణ క్యాడర్ కు వెళ్లారు. సీనియారిటీకి అనుగుణంగా 2019 డిసెంబర్ 31వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది.
సోమేష్ కుమార్ ను తెలంగాణలో కొనసాగనిస్తూ గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఆయనను వెంటనే ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 12వ తేదీన ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు.