తూర్పుగోదావరి:అతడుజనసేనలో చేరాడు...ఆమె టిడిపిలో చేరుతుందంటున్నారు!ఎవరంటే...?
తూర్పుగోదావరి:జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తాజాగా గట్టి షాక్ ఒకటి తగలగా...మరో షాక్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీ పార్టీని వీడి జనసేనలో చేరనున్నట్లు కాకినాడలో ప్రకటించారు. ఇది కాంగ్రెస్ కు తగిలిన ఒక షాక్ కాగా...
మరోవైపు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అధినేత, మెగాస్టార్ చిరంజీవిని చిత్తుచేసి జెయింట్ కిల్లర్ గా గుర్తింపు పొందిన పాలకొల్లు కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషారాణి...ఈమె కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అసలే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్య నేతలను కోల్పోవడం ద్వారా మరింత బలహీన పడటం ఖాయంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ వీడి...జనసేనలో చేరిక
తూర్పుగోదావరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతం నానాజీ ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. గత 32 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టానని...రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని తెలిసినా అదే పార్టీలోనే ఉంటూ విస్తృత సేవలందించానని ఆయన తెలిపారు. అయితే తనకు పవన్కల్యాణ్ విధివిధానాలు బాగా నచ్చడంతో జనసేన పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు.
పవన్...జిల్లాకు రాగానే
కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ప్రజలకు, తనను నమ్ముకున్నవారికి సరైన న్యాయం చేయలేకపోతున్నానని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో జనసేనలో చేరనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్తో తనకెటువంటి విబేధాలు లేవని...అయినా తాను ఒక్క కార్యకర్తను కూడా వెంట తీసుకెళ్లడం లేదని అన్నారు. జనసేన పార్టీలో బేషరతుగా చేరుతున్నానని...ఏ టికెట్ ఆశించడం లేదని...కేవలం పవన్కల్యాణ్ విధివిధానాలు నచ్చినందువల్లే ఆయన పార్టీలో చేరుతున్నట్లు పంతం నానాజీ చెప్పారు. పవన్ తమ జిల్లా పర్యటన సమయంలో జనసేనలో అధికారికంగా చేరతానని పంతం నానాజీ తెలిపారు.
ఆమె కూడానా...మరో షాక్...
ఇక మరోవైపు గడచిన రెండేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న కాంగ్రెస్ మహిళా నేత, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తారని అనుకుంటున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ చిరంజీవిని ఓడించడం ద్వారా బంగారు ఉషారాణి సంచలనం సృృష్టించి జెయింట్ కిల్లర్ గా ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే ఈమె కాంగ్రెస్ తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న 2014లో మరోసారి పోటీచేయగా ఓటమి పాలయ్యారు.
జెయింట్ కిల్లర్...టిడిపి లోకి?
ఆ ఓటమి తరువాత ఈమె మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లో కనిపించలేదు...అయితే అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఉషారాణి పేరు ఇటీవల మళ్లీ తెరమీదకు వస్తోంది. ఆమె త్వరలోనే టిడిపిలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. టిడిపి నుంచి ప్రపోజల్ వచ్చిందో లేక...తనంతట తానుగా ఆ పార్టీలో చేరాలనుకుంటున్నారో తెలియదు కానీ ఆమె అయితే తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని అక్కడి నేతలు గట్టిగా చెబుతున్నారు. అదే జరిగితే తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రెండో షాక్ కూడా తగిలినట్లే!