హాస్టల్లో ఒకరు.. ఇంట్లో ఒకరు..: అనంతలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య, కారణాలేంటి?
లోపల కూతురు ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు.
అనంతపురం: అనంతపురం జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు ఒకే రోజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ విద్యార్థిని కళాశాల హాస్టల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. మరో విద్యార్థిని ఇంటి వద్దే ఆత్మహత్యకు పాల్పడింది.
ఇద్దరు విద్యార్థినులు తమ చున్నీలతోనే ఉరేసుకుని చనిపోయారు. చనిపోయిన విద్యార్థినుల్లో సంజనాకృష్ణ అనంతపురం పట్టణానికే చెందిన విద్యార్థిని కాగా.. మరో విద్యార్థిని యమునా జిల్లాలోని కొత్త చెరువు గ్రామానికి చెందిన విద్యార్థి.
యమున నేపథ్యం:
కొత్తచెరువుకు చెందిన రామాంజనేయులు కుమార్తె యమున (16) అనంతపురం నగరంలోని శారదానగర్లో గల శ్రీసాయి కళాశాలలో ఇంటర్ సీఈసీ తెలుగు మీడియం మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఉండలేక యమున తీవ్ర ఆవేదన చెందుతుండేదనీ, ఈ క్రమంలో పలుసార్లు ఇంటికి వెళ్లి వచ్చేదని కళాశాల యాజమాన్యం చెబుతోంది.
హాస్టల్లో మనస్తాపంగా:
దీపావళి పండుగకు ఇంటికెళ్లిన యుమున తిరిగి ఆదివారం రాత్రి తల్లిని తీసుకుని హాస్టల్కు వచ్చింది. తల్లి వెళ్లిపోయాక మనస్తాపంగా కనిపించింది. మరుసటి రోజు ఉదయం కూడా క్లాస్కు రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఆరా తీసినట్టు తెలుస్తోంది.
యమున తనకు జ్వరం వచ్చిందని చెప్పడంతో ఫీవర్ టాబ్లెట్ కూడా ఇచ్చారట. టాబ్లెట్ వేసుకుంటానని హాస్టల్ గదికెళ్లిన యమున తిరిగి క్లాస్కు రాలేదు. చాలాసేపటి వరకు యమున గది నుంచి బయటకు రాకపోవడంతో.. గది వద్దకు వెళ్లి చూడగా ఆమె అప్పటికే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కాలేజీపై ఆరోపణలు:
తమ కూతురి చావుకు కళాశాల యాజమాన్య ఒత్తిళ్లే కారణమని యమున తండ్రి రామాంజనేయులు ఆరోపించారు. దీపావళి తర్వాత రూ.3వేలు ఫీజు చెల్లించాలని కాలేజీ అధ్యాపకులు చెప్పారని, కాలేజీకి వెళ్లేప్పుడు తన కూతురు డబ్బు గురించి అడిగిందని రామాంజనేయులు వాపోయారు.
డబ్బులు తీసుకురాకుండానే కాలేజీకి వెళ్లడంతో యాజమాన్యం మందలించిందని, ఆ మనస్తాపంతోనే తమ కూతురు అఘాయిత్యానికి పాల్పడిందని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కాలేజీ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య చేసుకున్న యమున గదిలో మరో విద్యార్థినికి సంబంధించిన సూసైడ్ నోట్ దొరకడం ఆశ్చర్యం కలిగించింది. శ్రీలత అనే విద్యార్థిని పేరిట ఉన్న ఆ నోట్ ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీలతను చాలారోజుల క్రితమే ఆమె తల్లిదండ్రులు చదువు మానిపించేసి ఊరికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. యమున పుస్తకంలో ఆ నోట్ బయటపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సంజనాకృష్ణ నేపథ్యం:
అనంతపురం పట్టణంలోని వేణుగోపాల్నగర్కు చెందిన సంజనాకృష్ణ (14) అనే విద్యార్థిని స్థానికంగా విద్యానికేతన్ స్కూల్లో పదోతరగతి చదువుతుండేది. సెల్ఫోన్ ఎందుకు తీశావంటూ మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులు ఆమెను మందలించారు.
అంతేకాదు, ఏదో ఒక కారణం చెప్పి స్కూల్ కు డుమ్మా కొడుతోందని తల్లిదండ్రులు కోప్పడ్డారు. అయితే తనకు ఆరోగ్యం బాగాలేదని, శ్వాస సమస్యలు ఉన్నాయని చెప్పినా తల్లిదండ్రులు వాపోయేదని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో:
మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంజనాకృష్ణ ఆత్మహత్యకు పాల్పడింది. చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది. పనికి వెళ్లి తిరిగొచ్చిన తల్లిదండ్రులు తలుపు తీయాల్సిందిగా కూతురిని పిలిచారు. ఎంతకీ ఉలుకు, పలుకు లేకపోవడంతో కిటికీ తెరిచి చూశారు. లోపల కూతురు ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. కూతురిని అలా చూసి ఆమె బోరుమన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.