యాత్రా విషాదం: అమర్నాథ్లో ఒకరు మృతి, మానససరోవర యాత్రలో మరొకరు
న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్ర, మానససరోవర యాత్రల్లో మంగళవారం అపశృతులు చోటు చేసుకున్నాయి. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం(72) గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన బలకేజ్ బేస్ క్యాంప్లో జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
నాలుగు రోజుల క్రితమే రత్నం రాజమండ్రి వాసులతో కలిసి యాత్రకు వెళ్లినట్లు సమాచారం. రత్నం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకి అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని చాగల్లుకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మానస సరోవర్ యాత్రలో కాకినాడ వాసి మృతి
ఇది ఇలా ఉండగా, మానస సరోవర్ యాత్రలోనూ విషాదం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు యాత్రలో మృతిచెందారు. మానస సరోవరం నుంచి తిరుగి వస్తుండగా మార్గమద్యమంలోని టిబెట్ ప్రాంతంలో మృతి చెందినట్లు సమాచారం.
మానససరోవర యాత్ర: ఇబ్బందుల్లో తెలుగు యాత్రికులు, బేస్ క్యాంపులో 3వేలమంది
ఆయన మృతదేహాన్ని హిల్సా నుంచి సిమిల్ కోట్కు తరలించారు. అక్కడి నుంచి అధికారులు మృతదేహాన్ని నేపాల్ గంజ్కు తరలించారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని లక్నో మీదుగా స్వస్థలానికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రమైన మంచు కారణంగా వందమందికి పైగా తెలుగువారు బేస్ క్యాంప్లోనే చిక్కుకున్న విషయం తెలిసిందే.