బిజెపి ని చూసి భయపడుతున్న ఇద్దరు సిఎంలు:జివిఎల్,ఆ పార్టీ ప్రాంతీయ భేదాలు రెచ్చగొడుతోంది:డొక్కా
హైదరాబాద్: బీజేపీని చూసి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు భయపడుతున్నారని, వాళ్ళ భయం త్వరలో నిజం కాబోతుందని బిజెపి ఎంపీ జీవీఎల్ నర్సింహారావు వ్యాఖ్యానించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఎందుకో చెప్పడం లేదని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభంజనం వీస్తుందనే భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని జివిఎల్ విమర్శించారు. ఇక టిడిపి శని తమను వదిలి కాంగ్రెస్ను పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఏపీలో టిడిపి నేతలు ఊదరగొడుతున్నట్లుగా అభివృద్ధి ఏమీ లేదని...అంతా అప్పులే మిగిలాయని తేల్చేశారు.
అప్పులు, అవినీతిలో సీఎంలు కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ పోటీపడుతున్నారు అని బిజెపి ఎంపీ జీవీఎల్ నర్సింహారావు విమర్శించారు. కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా...ఆయనకు మెజార్టీ ఇచ్చిన తెలంగాణ ప్రజలను వంచించారన్నారు. ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చావో చెప్పు అని కెసిఆర్ ను జివిఎల్ ప్రశ్నించారు.
దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానన్న నువ్వు...కుటుంబంలోని వారికి పదవులు ఇచ్చుకున్నావని కెసిఆర్ పై జీవీఎల్ మండిపడ్డారు. దళితులకు మూడెకరాలు ఇస్తానని చెప్పి...ఎన్ని ఎకరాలు ఇచ్చావు, ఎంత మందికి ఇచ్చావు అని నిలదీశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చని మీరు...ఇంటింటికి వెళ్లి క్షమాపణ అడగాలని జివిఎల్ సూచించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మహిళల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. కెసిఆర్ కేంద్ర పథకాలకు తన పథకాలని బ్రాండ్ వేసుకున్నారని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే తంతు అని...అక్కడ కూడా చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకుంటున్నాడని తెలిపారు. ఇక కాంగ్రెస్ రాజకీయ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తోందని...పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ స్టెపినీగా స్టెపినీగా మారుతోందని జివిఎల్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో తామే టీడీపీతో పొత్తు వద్దనుకున్నామని...టీడీపీతో పోతే ఓట్లు పడవు అని ఇక్కడి నేతలు చెప్పారని జివిఎల్ వెల్లడించారు. టీడీపీ శని తమను వదిలి కాంగ్రెస్ను పట్టుకుందని వ్యాఖ్యానించారు. మహాకూటమికి తెలంగాణ ద్రోహుల కూటమి అని పేరుపెట్టుకోమని జివిఎల్ సూచించారు.పెట్రోలు డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని...లేదంటే రాష్ట్రాలు విధించే పన్ను తగ్గించాలని జీవీఎల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఇదిలావెంటే టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రాంతీయ విబేధాలను రెచ్చగొడుతోందని విమర్శించారు. రాయలసీమపై నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలని డొక్కా సవాల్ చేశారు. రాయలసీమ ప్రగతిపై బీజేపీ నేతలు చర్చకు సిద్ధమా?...అని మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు.