జగన్కు 'నంది' షాక్, వైసీపీలో చిచ్చు: నేను చెప్పిందే ఫైనల్.. ఆదిశేషగిరిరావుపై అంబటి
నంది అవార్డుల ప్రకటన అధికార టీడీపీకి చుక్కలు చూపిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అవార్డుల ప్రకటనను తప్పుబడుతోంది.
అమరావతి: నంది అవార్డుల ప్రకటన అధికార టీడీపీకి చుక్కలు చూపిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అవార్డుల ప్రకటనను తప్పుబడుతోంది.
Recommended Video
అయితే, తాజాగా నటుడు కృష్ణ సోదరుడు, వైసిపి నేత ఆదిశేషగిరి రావు వ్యాఖ్యలు, వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. అవార్డులపై వైసీపీలోను చిచ్చు కనిపిస్తోంది. వారు ఇరువురు వేర్వేరు గొంతులు వినిపించారు.
నంది అవార్డులపై వైసిపి రెండు నాల్కల ధోరణి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిన ఆదిశేషగిరి రావు, అంబటి రాంబాబులు కొద్దిసేపటి వ్యవధిలో ఒకే వేదిక పై నుంచి వేర్వేరుగా మాట్లాడారు. అవార్డులపై అంబటి విమర్శలు గుప్పిస్తే, ఆదిశేషగిరి రావు విమర్శలు సరికావని చెప్పడం గమనార్హం. దీంతో వైసిపిలోను అవార్డుపై వేర్వేరు వాదనలు వెలుగు చూశాయి.
అసంతృప్తి ఉండటం ఖాయం
నంది అవార్డులపై ఆదిశేషగిరి రావు తొలుత మాట్లాడారు. అవార్డులు రాని వారికి అసంతృప్తి ఉంటుందని, జాతీయ అవార్డులు వచ్చినా, నంది వచ్చినా కొందరికి అసంతృప్తి ఖాయమని చెప్పారు. అవార్డుల కోసం కమిటీని వేస్తారని, రికమండేషన్స్ పంపిస్తారని, వాటి ఆధారంగా ఇస్తారన్నారు. అసంతృప్తి వరకు ఒకే కానీ, ప్రశ్నించలేమని అభిప్రాయపడ్డారు.
పోసాని కృష్ణ మురళిపై ఆగ్రహం
అంతేకాదు, నంది అవార్డుల ప్రకటనలోకి కులాలను లాగడాన్ని ఆదిశేషగిరి రావు తప్పుబట్టారు. అవార్డులకు కులాలు లేవని తేల్చి చెప్పారు. అవార్డులు వెనక్కి ఇస్తానని పోసాని కృష్ణమురళి చెప్పడం సరికాదని, ఆయన అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహించారు.
నందికి ఆదిశేషగిరి రావు మద్దతు వెనుక ఇదే కారణమా
అయితే, ఆదిశేషగిరి రావు నంది అవార్డులకు ఓ రకంగా అనుకూలంగా మాట్లాడారని అంటున్నారు. అందుకు కారణం ఉందని చెబుతున్నారు. ఆయన కుటుంబంలోని మహేష్ బాబుకు శ్రీమంతుడు సినిమాకు, గౌతమ్కు మరో సినిమాకు రెండు నందులు వచ్చాయని, అందుకే అలా మాట్లాడుతున్నారేమో అంటున్నారు.
అవార్డులపై అంబటి రాంబాబు ఆగ్రహం
మరోవైపు, అంబటి రాంబాబు వాదన మరోలా ఉంది. అవార్డులు ఇచ్చిన తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అవార్డులు పక్షపాత ధోరణితో ఇచ్చారన్నారు. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్యాయంగా అక్రమంగా ఇచ్చారని, ఓ వర్గానికి ఇవ్వాలనే దృక్పథం అవార్డుల్లో కనిపించిందని దుయ్యబట్టారు.
నేను పార్టీ తరఫున మాట్లాడుతున్నా
మీ పార్టీలో ఉన్న ఆదిశేషగిరి రావు అవార్డులపై మరో రకంగా మాట్లాడారని చెప్పగా అంబటి స్పందించారు. ఎవరు ఏం చెప్పారో తమకు తెలియదని, తాను పార్టీ తరఫున మాట్లాడుతున్నానని తెల్చి చెప్పారు. తాను అధిష్టానంతో మాట్లాడాకే చెబుతున్నానని, తాను చెప్పిందే పార్టీ అభిప్రాయం, ఆదిశేషగిరి రావుది వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. ఆయన అభిప్రాయం తనకు తెలియదన్నారు.
స్పీకర్ ఇష్యూపై.. క్షమాపణ చెప్పేందుకు సిద్ధం
ఇక, అసెంబ్లీలో తనకు ప్రివిలేజ్ మోషన్ అంశంపై అంబటి స్పందించారు. స్పీకర్ కోడెలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సభలో అంబటిపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశ పెట్టారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా చెప్పానని భావిస్తే క్షమాపణ చెబుతానని తెలిపారు. కోడెల తన రాజకీయ ప్రత్యర్థి అని, తన కేడర్ను చిన్నాభిన్నం చేస్తుంటే రాజకీయంగా స్పందిస్తానని చెప్పారు.