ఇద్దరు వివాహితలు: గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం..
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన ఎ.దుర్గ రాజమండ్రి గోదావరి నదిలో దూకింది.ఆమెతో పాటు విశాఖకు చెందిన రాజేశ్వరి కూడా ఆత్మహత్యకు యత్నించింది.అక్కడే ఉన్న బోట్ డ్రైవర్స్ వీరిద్దరిని రక్షించి ఆ
రాజమండ్రి: ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం వాళ్లిద్దరిని ఒక చోటకు చేర్చింది. అప్పటిదాకా ఒకరికొకరు తెలియకపోయినా.. ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆత్మహత్యకు యత్నించారు గానీ అదృష్టం బాగుండి బతికిపోయారు. రాజమండ్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన ఎ.దుర్గకు 8 ఏళ్ల క్రితం వివాహమైంది. భర్తతో కలిసి రాజమహేంద్రవరం వీఎల్పురంలో నివాసం ఉంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. సోమవారం రాత్రి భర్తతో తీవ్ర వాగ్వాదం జరగడంతో.. ఇంటి నుంచి బయటకొచ్చింది.
రాజమండ్రి గోదావరి గట్టుకు చేరుకుని రాత్రంతా అక్కడే ఉండిపోయింది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని పిండాల రేవు వద్దకు వెళ్లింది. అదే సమయంలో మరో మహిళ అక్కడ ఎదురుపడింది. ఆమె పేరు రాజేశ్వరి. కుటుంబ సమస్యలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్నానని, తనది విశాఖపట్నం అని చెప్పింది.
అనంతరం రాజేశ్వరి వెంట తెచ్చుకున్న పురుగుల మందును ఇద్దరూ కలిసి తాగారు. తర్వాత అక్కడే ఉన్న పడవలు ఎక్కి గోదావరి నదిలో దూకారు. అదే సమయానికి విధి నిర్వహణలో ఉన్న పర్యాటక శాఖ బోట్ డ్రైవర్స్ రమణారావు, వెంకట్రావులు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. స్థానిక ఆసుపత్రికి తరలించగా.. చికిత్స అనంతరం దుర్గ కోలుకుంది. రాజేశ్వరి మాత్రం ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.