కాకినాడ కాజా లాంటి సీటు...నాకేనంటూ ఇద్దరు వైసీపీ నేతల ఫైటు..!
ఏపీలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ సిటీ నియోజకవర్గ వైసీపీ సీటు కోసం ఇద్దరు కీలక వ్యక్తులు తీవ్ర స్థాయిలో పోటీపడుతుండటం తాజా పరిణామాల నేపథ్యంలో తెరమీదకు వచ్చింది. విజయవాడ టికెట్ విషయమై ఇదేవిధంగా రచ్చ జరుగుతున్న క్రమంలో స్వయంగా వైసిపి అధినేత జగన్ రంగంలోకి ఆ సీటు వంగవీటి రాధాదే అని గౌతమ్ రెడ్డి చేతే ప్రకటింపచేయడంతో అక్కడ వివాదం సమసిపోయింది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉన్న నియోజకవర్గాల గురించి ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.
ఒకే సీటు కోసం ఇద్దరు వైసిపి నేతలు తీవ్ర స్థాయిలో పోటీపడుతున్న నియోజకవర్గాల్లో కాకినాడ సీటు ఒకటి. వచ్చే ఎన్నికల్లో ఈ సీటు కోసం హోరాహోరీగా ఫైట్ జరుగుతుండటంతో ఇప్పుడు కాకినాడ వైసీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. దీంతో వైసిపి అధినేత జగన్ కు సమస్యాత్మంగా...స్థానిక పార్టీ క్యాడర్ కు ఇబ్బందికరంగా మారిన ఆ ఇద్దరు నేతల కథాకమామిషు తెలుసుకుందాం...
గతంలో...ఏంజరిగిందంటే...
2004లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరపున ముత్తా గోపాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇంకా ముందుకు వెళ్లి చూస్తే ముత్తా గోపాలకృష్ణ కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు గెలుపొందినాడు. గతంలో ఆయనకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా లభించింది. 1983, 1985, 1994, 2004లలో విజయం సాధించిన ముత్తాకు 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్టు లభించనందున నిరసనగా ఆ పార్టీకి రాజీనామా చేశాడు...2009లో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో ఉన్నా జగన్ తనకు అప్పటి సన్నిహితుడు ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డికి సీటు వచ్చేలా చక్రం తిప్పారు. జగన్ ఒత్తిడితో చివరకు వైఎస్ కూడా ముత్తా గోపాలకృష్ణను తప్పించి ద్వారంపూడికి సీటు ఇవ్వడం జరిగిందని అంటారు. ఏదేమైనా అలా ద్వారంపూడి టికెట్ దక్కించుకోవడం ఆ తరువాత ఆయన గెలవడం కూడా జరిగిపోయాయి...
అయితే...ఆ తరువాత...
అయితే 2014లో ద్వారంపూడి కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ద్వారంపూడి టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచెయ్యక పోతుండటంతో జగన్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా ద్వారంపూడిలో మార్పు లేకపోవడంతో జగన్ చివరకు మాజీ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ తనయుడు ముత్తా శశిధర్ను సిటీ నియోజకవర్గ కో ఆర్డినేటర్గా నియమించారు...అయితే ఆ తర్వాత ద్వారంపూడి మళ్లీ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యి నానా రభస చేయడంతో చివరకు కాకినాడ సిటీకి ఇటు శశిధర్తో పాటు అటు ద్వారంపూడిని కూడా కో ఆర్డినేటర్గా నియమించారు.
అయితే...ఇక ఇప్పుడే సమస్య...
ఒకే నియోజకవర్గానికి ఇద్దర్నీ కో ఆర్డినేటర్లుగా నియమించడంతో అప్పుడు తాత్కాలికంగా సమస్య సమసిపోయినా ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే సరికి చిక్కుముడిగా మారుతోంది. పైగా జగన్ ఇటీవలే ద్వారంపూడిని రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉన్నఅనపర్తి నుంచి పోటీ చేయాలని సూచించగా, ద్వారంపూడి అందుకు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. తనకు ఇస్తే కాకినాడ సీటే ఇవ్వమని లేకుంటే తాను పార్టీలో కొనసాగి ప్రయోజనం లేదని నేరుగా జగన్ నే హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో జగన్ ఎలా సర్థిచెప్పాలో అర్థం కాక ఇద్దరిని అలా కోఆర్డినేటర్లుగానే కంటిన్యూ చేస్తున్నారని అంటున్నారు.
మరి ఇక ఇప్పుడు...తేలక తప్పని పరిస్థితి...
అయితే ఎన్నికలు అతి సమీపంలోకి వచ్చేస్తుండటం...పైగా ముందస్తు ఎన్నికలే ఖాయమనే ప్రచారం...కాకినాడ సీటు కోసం ప్రయత్నిస్తున్న ఈ ఇద్దరు నేతల మధ్య పోటీని పతాక స్థాయికి చేరుస్తోంది...దీంతో ఎవరికి వారు కాకినాడ సీటు తనకే అంటే తనకే అంటూ అటు శశిధర్, ఇటు ద్వారంపూడి ఇద్దరూ చెపుతున్నారు. పైగా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల తరుణం నుంచి ముత్తా శశిధర్ ఈ నియోజకవర్గం పరిధిలో పార్టీ తరపున బాగానే ఖర్చు పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. పార్టీ కోసం ఖర్చు పెడుతున్న తనకే జగన్ కాకినాడ సీటుపై హామీ ఇచ్చారని శశిధర్ ధీమా వ్యక్తం చేస్తుంటే...అసలు నియోజకవర్గంలో వైసిపి కేడర్ అంతా తనవైపే ఉందని, అలాంటప్పుడు జగన్ తనకు కాకుండా వేరొకరికి టికెట్ ఎలా ఇస్తారని ద్వారంపూడి అంటున్నారు....ఏదేమైనా వీరిద్దరి మధ్య ఆ నియోజకవర్గ వైసిపి నేతలు మాత్రం అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోతున్నారని చెప్పుకుంటున్నారు....మరి ఇలాంటి పరిస్థితే ఉన్న విజయవాడలో స్పష్టత ఇప్పించిన జగన్ ఈ నియోజకవర్గంలో కూడా అలాగే చేస్తే అంతిమంగా వైసిపికి మేలు జరుగుతుందని స్థానిక వైసిపి అభిమానులు కోరుకుంటున్నారు.