పవన్ కల్యాణ్ పర్యటన కోసంఫ్లెక్సీలు కడుతూ...కరెంట్ షాక్తో ఇద్దరు మృతి
విశాఖపట్టణం:జనసేన అధినేత పవన్కల్యాణ్ పర్యటన విశాఖ పర్యటన నేపథ్యంలో విషాదం చోటుచేసుకుంది. పవన్ రాక సందర్భంగా ఇద్దరు యువకులు ఫ్లెక్సీలు కడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగెలు తగలటంతో కరెంట్ షాక్ కు గురై మృతిచెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో పెను విషాదం చోటుచేసుకుంది.
జనసేన అధినేత పవన్కల్యాణ్ విజయనగరం జిల్లా పర్యటన ముగించుకొని ప్రస్తుతం విశాఖ జిల్లాలో అరకు నుంచి పర్యటన ఆరంభించిన సంగతి తెలిసిందే. బుధవారం పవన్ జిల్లాలోని పాయకరావుపేటలో పర్యటించనున్నారు. దీంతో తమ అభిమాన హీరో రాకను పురష్కరించుకుని తునికి చెందిన తోళెం నాగరాజు, పాయకరావుపేటకే చెందిన శివ అనే ఇద్దరు యువకులు సాయిమహల్ జంక్షన్ దగ్గర భారీ స్వాగత ఫ్లెక్సీలు కట్టేపనిలో ఉన్నారు.
ఈ క్రమంలో వాటిని రహదారి పక్కనే కడుతుండగా ఆ ఫ్లెక్సీలు పక్కనే ఉన్న విద్యుత్ తీగెలు తగలడంతో విద్యుత్ షాక్ గురై మృతిచెందారు. చేతికి ఎదిగొచ్చిన కొడుకులు తమ అభిమాన హీరోపై అభిమానాన్ని చాటుకునేందుకు బ్యానర్లు కట్టేక్రమంలో కరెంట్ షాక్ తో మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. దీంతో పాయకరావుపేటలో విషాదఛాయలు నెలకొన్నాయి.