ఎమ్మెల్యే చింతమనేని అనుచరులమంటూ కానిస్టేబుల్పై దాడి, వీరంగం
అమరావతి: విజయవాడ నగరంలోని బందరు లాకుల వద్ద గురువారం రాత్రి దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులమంటూ ఇద్దరు యువకులు ఓ కానిస్టేబుల్పై దాడికి దిగారు. ట్రాఫిక్ సిగ్నల్ దాటి వేగంగా ముందుకెళ్తున్న ఏపీ16 సీఎం 2244 నెంబరు గల కారును ట్రాఫిక్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ ఆపి పక్కన పెట్టాలని కోరారు.
నన్ను చంపేయాలనుకుంటున్నారు, సీఎం కంటే ఎక్కువే అవుతా: పవన్ కళ్యాణ్ సంచలనం
దీంతో కారులోని యువకులు దుర్భాషలాడుతూ ఆయనతో ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ కారును పోలీస్ స్టేషన్కు తరలించాలని చెప్పారు. మరింత ఆగ్రహానికి గురైన సదరు యువకులు కానిస్టేబుల్పై చేయి చేసుకున్నారు.
అంతేగాక, తాము దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులమని చెప్పుకుంటూ వీరంగం సృష్టించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు యువకులను అదుపులోకి తీసుకుని కారును గవర్నర్ పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. కానిస్టేబుల్ అనిల్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా వారిపై గవర్నర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది ఇలావుంటే, తన అనుచరులని చెప్పుకుంటూ కానిస్టేబుల్పై దాడి చేసిన వారితో తనకెలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. తన పేరు వాడుకుని అరాచకాలు సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అంతేగాక, తన పేరు వాడుకుని ఎవరైనా దాడులకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చింతమనేని కోరారు.