జగన్కు రివర్స్: అక్కడే చిక్కు వచ్చింది.. టీడీపీలోకి ఇద్దరు కీలక నేతలు, కారణమిదే?
అమరావతి: ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేడా మల్లికార్జున రెడ్డి, అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్ తదితరులు జగన్ను కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో సీట్ల కోసం నేతలు పార్టీ మారుతుంటారు. ఇందులో భాగంగా ఇద్దరు వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
టీడీపీ వైపు చూస్తున్న వైసీపీ విష్ణువర్దన్ రెడ్డి
కావలి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ సీటు పైన ఆశలు పెట్టుకున్న వైసీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీలో చేరవచ్చుననే ప్రచారం సాగుతోంది. విష్ణువర్ధన్ రెడ్డి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులు. అతను కావలి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రతాప్ కుమార్ రెడ్డి ఉండటంతో టీడీపీలో చేరి పోటీ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.
విష్ణు అసంతృప్తి
వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. వైయస్ మృతి పరిణామాల అనంతరం జగన్ పార్టీ స్థాపించడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి టీడీపీ నేత బీద మస్తాన్ రావు చేతిలో 19వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ఆ తర్వత వైసీపీలో చేరారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి నాడు టిక్కెట్ ఇచ్చినప్పుడే అసంతృప్తికి గురైనట్లుగా వార్తలు వచ్చాయి. 2014లో రామిరెడ్డి పోటీ చేసారు. ఇప్పుడు మరోసారి కూడా అవకాశం దక్కకుంటే టీడీపీలో చేరాలని భావిస్తున్నారట.
వేణుగోపాల్ రెడ్డి కూడా టీడీపీ వైపు
నెల్లూరు జిల్లాకు చెందిన మరో నేత వీ వేణుగోపాల్ రెడ్డి కూడా టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన అంతకుముందు టీడీపీ నేత. ఆ తర్వాత వైసీపీలో చేరారు. పార్టీలో తమకు ప్రాధాన్యత లేకుంటే కార్యకర్తల నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెబుతున్నారట.
ఎమ్మెల్యేలకు వల వేస్తున్నాడని
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ ఎమ్మెల్యేలకు వల వేస్తున్నారని, తన నల్ల డబ్బుతో వల వేస్తున్నాడని, కానీ తమకు అలాంటి రాజకీయాలు తెలియవని టీడీపీ నేతలు అంటున్నారు. తమ పార్టీలో చేరాలనుకునే వారికి తాము ఎలాంటి ఆపర్లు ఇవ్వడం లేదని, డబ్బుతో అట్రాక్ట్ చేయమని చెప్పారు.