జగన్కి ఎంపీ హ్యాండ్: టిడిపిలోకి ఎస్పీవై, క్యూలో రేణుక
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులు హ్యాండిచ్చారు. నంద్యాల నుండి జగన్ పార్టీ తరఫున ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. బుట్టా రేణుక కూడా టిడిపిలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. ఎస్పీవై రెడ్డి ఢిల్లీలో ఉన్న చంద్రబాబును కలుసుకున్నారు. టిడిపిలో చేరుతున్నట్లు చెప్పారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా, జగన్ పార్టీ నుండి పార్లమెంటు సభ్యులుగా గెలుపొందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని ఉదయం నుండి జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అంతకుముందే వారు టిడిపి ముఖ్యనేతలతో చర్చలు జరిపి నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ఆదివారం చంద్రబాబును కలిసి అనంతరం టిడిపిలో చేరారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున కర్నూలు, నంద్యాల లోకసభల నుండి ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుకలు పోటీ చేసి గెలుపొందారు. అయితే పలు కారణాలతో వారు జగన్ నుండి దూరం వెళ్లాలనుకుంటున్నారట.
తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చినందున మరో ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, అలాగే కేంద్రంలో ఎన్డీయే కూటమిలో టిడిపి ఉందని, దానికి తోడు వైయస్ జగన్ కేసులలో ఇరుక్కోవడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, ఈ కారణంగానే టిడిపిలో చేరినట్లుగా చెబుతున్నారు. వారిని బుజ్జగించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్లు రంగంలోకి దిగినా ఫలితం కనిపించలేదు.