జగన్కు ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్: టిడిపిలోకి జంప్, అందుకేనా?
ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు ఎమ్మెల్యేలు షాకివ్వనున్నారా? అంటే కావొచ్చునని వార్తలు వస్తున్నాయి. వైసిపికి చెందిన ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావులు టిడిపిలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పచ్చ జెండా కోసం ఆగుతున్నారని తెలుస్తోంది. చంద్రబాబు కూడా వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అయితే మాజీ ఎంపి, పార్టీ సీనియర్ నేత కరణం బలరాంతో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటికి విభేదాలు ఉన్నాయి.
వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కరించాల్సి ఉందని అంటున్నారు. వాటి పరిష్కారం అయ్యాక గొట్టిపాటి టిడిపిలోకి వచ్చే అవకాశముందని అంటున్నారు. మరోవైపు కందుకూరు ఎమ్మెల్యే రామారావు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రామారావు, గొట్టిపాటిలు గ్రానైట్ వ్యాపారంలో ఉన్నారు. వారికి తన వ్యాపారం విషయంలో ప్రభుత్వం సహకారం అవసరం ఉంటుందని, అందుకే ఆయన టిడిపి వైపు చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే తమ క్యాడర్ను కూడా కాపాడుకోవాలంటే టిడిపిలోకి వెళ్లడమే మేలని భావిస్తున్నారని తెలుస్తోంది.
ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావులు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిద్దరు తమ పార్టీ అధిష్టానంతో టచ్లో ఉన్నారని, అయితే వారు పార్టీలో చేరేందుకు కొంత సమయం తీసుకుంటుందని టిడిపి సీనియర్ నేత జనార్ధన్ అన్నట్లుగా తెలుస్తోంది.