విశాఖ టు విజయవాడ.. డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే..!
విశాఖపట్నం : డబుల్ డెక్కర్ రైలు రెడీ అయింది. విశాఖపట్నం - విజయవాడ మధ్యన ఉదయ్ ఎక్స్ప్రెస్ దూసుకెళ్లుతోంది. ఆ మేరకు రైల్వే సహాయ మంత్రి సురేశ్ చెన్నబసప్ప అంగడి గురువారం నాడు అధికారికంగా ప్రారంభించారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఉదయ్ రైలులో జర్నీ చేయాలంటే విశాఖ టు విజయవాడకు టికెట్ ధర 525 రూపాయలుగా నిర్ణయించారు అధికారులు. ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం నాడు స్పెషల్ ఎక్స్ప్రెస్గా నడుస్తున్న ఈ రైలు.. శుక్రవారం నుంచి వారానికి ఐదు రోజులు రెగ్యులర్గా నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఆర్టీసి సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా: మూహుర్తం ఖరారు: ఎలక్ట్రికల్ బస్సుల పైనా..!
విశాఖ - విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు
విశాఖ పట్నం - విజయవాడ మధ్యన నడిచే డబుల్ డెక్కర్ ఏసీ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఉదయ్ ఎక్స్ప్రెస్గా నామకరణం చేసిన ఈ ప్రత్యేక రైలును గురువారం నాడు రైల్వే సహాయ మంత్రి సురేష్ చెన్నబసప్ప అంగడి అధికారికంగా గురువారం నాడు ప్రారంభించారు. ఆ మేరకు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఒకటవ నంబర్ ప్లాట్ఫామ్పై నుంచి దూసుకెళ్లింది.
ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం నాడు మాత్రం స్పెషల్ ఎక్స్ప్రెస్గా ఉదయ్ రైలు నడుస్తోంది. ఆ తర్వాత శుక్రవారం నుంచి ఆదివారం, గురువారం మినహాయించి వారానికి ఐదు రోజుల పాటు ప్రయాణీకులకు ఈ రైలు సేవలు అందించనుంది.
ఐదున్నర గంటల ప్రయాణం.. వారానికి ఐదు రోజులు
22701 / 22702 నెంబర్తో నడిచే ఈ స్పెషల్ డబుల్ డెక్కర్ రైలు విశాఖ పట్నం నుంచి విజయవాడ చేరుకోవడానికి దాదాపు ఐదున్నర గంటల సమయం తీసుకోనుంది. 9 ఏసీ బోగీలు ప్రయాణీకులకు అనుకూలంగా తీర్చిదిద్దారు రైల్వే అధికారులు. శతాబ్ధి ఎక్స్ప్రెస్ రైలు మాదిరిగానే ఇందులో కూడా అత్యాధునిక సౌకర్యాలతో సీటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
విశాఖ పట్నం - విజయవాడ
విశాఖ పట్నం - విజయవాడ మధ్య నడిచే ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణం అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు రైల్వే అధికారులు. ఆ మేరకు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి కోచ్లో ఈ రైలుకు సంబంధించిన వేగం ఎప్పటికప్పుడు తెలియజేయడంతో పాటు నెక్ట్స్ వచ్చే స్టేషన్ వివరాలు తెలుసుకునేలా ఆరు డిస్ప్లే మానిటర్లు ఏర్పాటు చేయడం విశేషం. అంతేకాదు టీ, కాఫీ వెండింగ్ మెషీన్లు కూడా అందుబాటులో ఉంచారు.
మధ్యలో స్టాప్స్ ఇవే..!
విశాఖ పట్నం - విజయవాడ రూట్లో నడిచేటప్పుడు 22701 ట్రైన్ నెంబర్గా ప్రయాణీకులకు సేవలు అందించే ఉదయ్ ఎక్స్ప్రెస్.. విశాఖపట్నంలో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు బయలుదేరి విజయవాడకు సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు చేరుకోనుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 22702 నెంబరుతో విజయవాడలో సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖపట్నం రీచ్ కానుంది. మధ్యలో దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.