మనవడిపై బాబు: 40మంది పంచాంగకర్తలు కలిసి.. 12 ఏళ్లు అధికారంలో జగన్, లేదంటే గుడ్బై!
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు, గుంటూరు జిల్లాలోని కాకుమానులో వైసీపీ అధినేత వైయస్ జగన్, విజయవాడలో బీజేపీలు వేడుకలను నిర్వహించాయి.
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. చంద్రబాబుతో పాటు సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ పాల్గొన్నారు.
వెంకయ్య మాటేమిటి, హఠాత్తుగా యూటర్న్ తీసుకోలేదు, జగన్ను అనొద్దన్నారు: బాబుకు పవన్ దిమ్మతిరిగే షాక్
సంప్రదాయ దుస్తుల్లో చంద్రబాబు
డా. ప్రభల సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శ్రవణం వినిపించారు. వేద పండితులకు సత్కారంతో పాటు కళారత్న (హంస) ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. చంద్రబాబు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ప్రభుత్వం తట్టుకొని నిలబడుతుందని పంచాంగ శ్రవణం వినిపించారు. ప్రతిపక్షాల ఇబ్బందులను తట్టుకునేలా ఇప్పుడే సిద్ధపడాలన్నారు. పార్లమెంటులో మరిన్ని అలజడులు వస్తాయని, పల్లెల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
నా మనవడికి వేపపూవు చేదు కారణంగా నచ్చినట్లు లేదు
తన మనవడు దేవాన్ష్ కలిపిన ఉగాది పచ్చడినే తాను తొలుత తిన్నానని ఏపీ సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. ఆరు రుచుల్లోనే జీవితసారం ఇమిడి ఉందన్నారు. అందులోని వేపపువ్వు చేదుతో తన మనవడికి పెద్దగా నచ్చినట్లు లేదని, రెండుసార్లు తిని ఇక సరిపోయిందని చెప్పాడన్నారు. చింతపండు పులుపుతో నేర్పుగా వ్యవహరించాలన్న సంకేతం ఉందని, పచ్చిమామిడి రుచితో కొత్త సవాళ్లు ఎదురవుతాయన్నారు. కారంతో సహనం కోల్పోయే పరిస్థితి వస్తుందని, దానిని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. ఉగాది పచ్చడిలం ఎంతో అర్థం దాగి ఉందన్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరు పంచాంగ శ్రవణం వినాలన్నారు. భవిష్యత్తోల ఎలాంటి మార్పులు సంభవిస్తాయో తెలుస్తాయన్నారు.
వైసీపీకి 135 సీట్లు, 12 ఏళ్లు అధికారంలో జగన్
గుంటూరు జిల్లా ఉగాది వేడుకల్లో వైసీపీ అధినేత వైయస్ జగన్ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. వైసీపీకి 2019 ఎన్నికల్లో 135 సీట్లు వస్తాయని పంచాంగ శ్రవణం వినిపించారు. జగన్ 12 ఏళ్ల 8 నెలల 18 రోజులు అధికారంలో ఉంటారని తెలిపారు. త్వరలో వైయస్సార్ పాలన చూస్తామన్నారు. జగన్కు ఏపీకి మంచి జరగాలని రెండేళ్ల యాగం నిర్వహిస్తామన్నారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక పూర్ణాహుతి కోసం వస్తారన్నారు.
40మంది పంచాంగకర్తలు కలిసి.. లేదంటే సవాల్
వైసీపీకి అక్టోబర్ నుంచి రాజయోగం పట్టనుందని పంచాంగ శ్రవణం వినిపించారు. అక్టోబర్ 25 వరకు ఆయన జాతకంలో ఉన్న గోచార సమస్యలు పూర్తవుతాయన్నారు. జగన్ కీర్తి ఆ తర్వాత మరింత పెరుగుతుందన్నారు. తాను ముఖస్తుతి కోసం చెప్పడం లేదని, తాను చెప్పినవి తప్పయితే జీవితంలో పంచాంగ శ్రవణం చేయబోనని సవాల్ చేశారు. తాము 40 మంది పంచాంగకర్తలం కలిసి కూర్చొని భవిష్యత్తును అంచనా వేశామని, ఈ అంచనాలు ఏకాభిప్రాయమని చెప్పారు.
బీజేపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం
విజయవాడ పార్టీ కార్యాలయంలో బీజేపీ పంచాంగ శ్రవణంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పంచాంగ శ్రవణంలో ఆ పార్టీకి మంచి రోజులు ఉంటాయని చెప్పారు.