బాబుని ఆకాశానికెత్తిన కేంద్రమంత్రి, హోదాపై వ్యాఖ్య: మోడీని కలుస్తా: గవర్నర్
విజయవాడ/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్రం నుంచి అదనపు నిధులు రాబట్టడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. ఏపీ అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు బాగా కష్టపడుతున్నారని చెప్పారు.
ఏపీ ఆర్థిక పురోగతి సాధిస్తుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్ ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. రాఝధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు కష్టపడుతున్నారని తెలిపారు. కరవు ప్రాంతాల్లో పిఎంజిఎస్ పనులు కూడా చేసుకోవచ్చునని చెప్పారు.
కాగా, బిజెపి నేతలు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు వేరుగా మాట్లాడారు. ఏపీలో 24 గంటల ఉచిత విద్యుత్ కేంద్ర ప్రభుత్వం వల్లేనని చెప్పారు. అలాగే ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను అన్నింటిని కేంద్రం నెరవేరుస్తుందని చెప్పారు.
వీలైతే ప్రధాని మోడీని కలుస్తా
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోతున్నాయని గవర్నర్ నరసింహన్ అన్నారు. విభజన సమస్యలకు త్వరలో పరిష్కారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయమై వీలైతే ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని ఆయన చెప్పారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్ల పనితీరు బాగుందన్నారు. తన ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకతేమీ లేదని పేర్కొన్నారు. రోటీన్గానే పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీం జస్టిస్ జస్టిస్లను కలిశానన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాల మాటేంటన్న మీడియా ప్రశ్నకు ఆయన వేగంగా స్పందించారు.
ఇద్దరు సీఎంలు బాగా పని చేస్తున్నారన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. చిన్న చిన్న సమస్యలు సాధారణమేనని చెప్పారు. వాటి పరిష్కారం కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు తరచూ చర్చించుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, హైకోర్టు విభజన కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడను తెలంగాణ బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ తదితరులు కలిశారు. హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సదానంద గౌడ చెప్పారు.