తెర మీదికి కాళేశ్వరం: ఉమా భారతి హామీతో కెసిఆర్ దూకుడు (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం -చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి ఉమా భారతితో ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాట్లాడిన తర్వాత ప్రణాళికను మార్చుకుని, దానికి జాతీయ హోదా ఇవ్వడానికి తగిన హామీ పొందినట్లు చెబుతున్నారు.
తొలుత భావించినట్టుగా ప్రాణహిత -చేవెళ్ల అయితే ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడి హెగ్డి గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మించాలి. దీనివల్ల ముంపు గ్రామాలు ఎక్కువగా ఉంటున్నాయని, మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతోంది. దీనికి బదులు కాళేశ్వరంలో ప్రాజెక్టు నిర్మిస్తే మహారాష్టత్రో సంబంధం లేకుండా ముంపు గ్రామాలన్నీ తెలంగాణలోనే ఉంటాయి. ఇతర రాష్ట్రాలతో ఇబ్బందులు ఉండవు. దీంతో ప్రభుత్వం కాళేశ్వరం -చేవెళ్ల ప్రాజెక్టు పట్లే ఆసక్తి చూపుతోంది.
ఉమా భారతి హామీ
కాళేశ్వరం -చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఉమాభారతి హామీ ఇచ్చారని అంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి హుటాహుటిన హైదరాబాద్కు తిరిగి వచ్చి అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రితో పాటు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి సిడబ్ల్యుసి ఇంజనీర్లు ముగ్గురు హైదరాబాద్కు వచ్చారు.
ఏరియల్ సర్వే నిర్వహిస్తాం
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లిన తరువాత రెండు మూడు రోజుల్లో కాళేశ్వరం -చేవెళ్లపై ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. కాళేశ్వరం వద్ద భారీ ప్రాజెక్టు నిర్మించి, మరో నాలుగుచోట్ల నీటి నిల్వ కోసం నాలుగు చిన్న చిన్న బ్యారేజీలు నిర్మించి గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను వినియోగించుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. ఇరిగేషన్ ప్రాజెక్టులకు రీ -ఇంజనీరింగ్ చేయాలని చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి ప్రాణహిత -చేవెళ్ల ద్వారా దానికి శ్రీకారం చుట్టారు.
చేవెళ్ల వెనక్కి..
వివాదాస్పదంగా ఉన్న ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం -చేవేళ్ల ప్రాజెక్టును చేపట్టాలనే ప్రతిపాదనను రూపొందిస్తున్నారు. నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్రావు, ఇరిగేశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందువల్ల కేంద్రం ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు.
అందులో భాగం..
ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టును ప్రకటిస్తున్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పుడు ప్రాజెక్టు వ్యయం మొత్తం కేంద్రమే భరిస్తుంది. విభజన చట్టంలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఇదేవిధంగా ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రాన్ని కోరింది. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ప్రాజెక్టు డిజైన్ను మార్చి ముంపు ప్రాంతాలను తగ్గించే ప్రతిపాదన చేశారు. దాంతో సైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమాభారతి వద్ద ప్రాణహిత -చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అంశంపై చర్చకువచ్చింది. మహారాష్ట్ర అభ్యంతరాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. అయితే దీనికి బదులు కాళేశ్వరం -చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదిస్తే, ఎలాంటి అభ్యంతరాలు రావని ముఖ్యమంత్రి కెసిఆర్ ఉమాభారతి దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఏదో ఒక ప్రతిపాదనను తక్షణం కేంద్రం వద్దకు పంపించాలని ఉమాభారతి సూచించినట్టు తెలిసింది.
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు అనేక అడ్డంకులు ఉన్న పరిస్థితుల్లో కేంద్రం దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలిసింది. దీంతో ప్రత్యామ్నాయంగా కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారు. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, సహాయం అందించేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం ఉండదని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. దీనికోసం ఢిల్లీ నుంచి ఇంజనీరింగ్ నిపుణుల బృందం సైతం హైదరాబాద్కు వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు వ్యవహారంపై ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించినప్పటికీ ఎలాంటి వివరాలను మీడియాకు వెల్లడించలేదు.