కాపులను కించపరిచారు: చంద్రబాబుపై ఉమ్మారెడ్డి ధ్వజం
హైదరాబాద్: కాపులను కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు తమ పార్టీ కాపులను రెచ్చగొడుతోందని చంద్రబాబు కార్యాలయం చేసిన ప్రకటన దుర్మార్గమని ఆయన అన్నారు.
ఆ వ్యాఖ్యలు సిఎం స్థాయికి తగినవి కావని ఆయన అన్నారు. తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాపుల్లో చిచ్చుపెట్టడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన శనివారం మీడియా సమావేశంలో విమర్శించారు.
కాపుల సంక్షేమం, రిజర్వేషన్లపై ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు చెబుతూ దాన్ని చెడగొట్టే ధోరణిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహరిస్తోందని అనడం దురదృష్టకరమని ఉమ్మారెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా జరుగుతున్న కాపు గర్జనపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మిండపడ్డారు.
తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆదివారం తలపెట్టిన కాపు ఐక్య గర్జన రాజకీయ సభ కాదని ఆయన అన్నారు. భవిష్యత్తు తరాల భద్రత ప్రయోజనాల కోసమే కాపు గర్జన జరుగుతోందని ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు శుక్రవారంనాడు టెలీ కాన్ఫరెన్స్లో తమ పార్టీపై అసహనం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. కాపు గర్జన వెనక రాజకీయాలున్నాయంటూ తమ పార్టీ పేరు పెట్టి విమర్సించినందు వల్లనే తాను ప్రతిస్పందించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.