పవన్ మద్దతిచ్చినా ఒంటరి పోరే!: ‘రక్తం మరిగిన బాబు’ అంటూ ఉమ్మారెడ్డి ఆగ్రహం
విజయవాడ: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో 10కిపైగా రాష్ట్రాల్లో అమలులో ఉన్న ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వకుండా టీడీపీనే అడ్డుకుందని ఆరోపించారు.
2019లో జగన్కు మద్దతిచ్చేందుకు పవన్ రెడీ, బాబుకు దూరం అందుకే: వరప్రసాద్ సంచలనం
ఏపీకి 15ఏళ్లపాటు హోదా కావాలంటూ ఆనాడు వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు అన్నారని, నరేంద్ర మోడీ కూడా అందుకు మద్దతు పలికారని.. అయితే ఇప్పుడు అంతా యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు.
రక్తం మరిగిన బాబు ఎందుకు చల్లబడ్డారో?
ప్రత్యేక హోదా కాదని.. చంద్రబాబు కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఉమ్మారెడ్డి అన్నారు. మొదట ప్యాకేజీ ప్రకటన వినగానే రక్తం మరిగిందన్న చంద్రబాబు.. 5నిమిషాల్లోనే ఎందుకు చల్లబడ్డారో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం నిర్ణయాలనే సాదరంగా స్వాగతిస్తూ ఏపీ ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు.
హోదా కోసం జగన్ మొదట్నుంచి.. బాబు ఎగతాళి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మొదట్నుంచీ హోదా వస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుందని చెబుతున్నారని, హోదా కోసం ధర్నాలు, ఆందోళనలు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని ఉమ్మారెడ్డి తెలిపారు. తమ దీక్షలు, ధర్నాలను చంద్రబాబు ఎన్నోమార్లు ఎగతాళి చేశారని మండిపడ్డారు.
సీనియర్ నేత యూటర్న్ ఎందుకు తీసుకున్నారో?
హోదా సమావేశాలకు వెళితే జైల్లో పెట్టిస్తామంటూ, మీ పిల్లలపై పీడీ యాక్ట్ పెడతామంటూ నిరుద్యోగలు, విద్యార్థుల తల్లిదండ్రులను చంద్రబాబు భయపెట్టారని తెలిపారు. అంతేగాక, చంద్రబాబు హోదా ఏమైనా సంజీవనా? హోదా ఉన్న రాష్ట్రాలు ఏం సాధించాయని ఎదురు ప్రశ్నించారని గుర్తు చేశారు. కేంద్రం ఏ ప్రకటన చేసినా శాలువాలు కప్పి వారికి ధన్యవాదాలు తెలిపారని అన్నారు. దేశంలోనే సీనియర్ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు.. హోదాపై ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
డ్రామాలాడింది టీడీపీనే
హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తే నాటకాలన్నారని, ఆమరణ దీక్షలు చేస్తే భగ్నం చేశారని అన్నారు. ఏపీకి హోదా కోసం టీడీపీ, బీజేపీ ఎంపీలను సైతం రాజీనామా చేయాలని కోరినా.. వాళ్లు ముందుకు రాలేదని ఉమ్మారెడ్డి అన్నారు. వాళ్లు సహకరిస్తే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. అవిశ్వాసం విషయంలో వెనక్కి తగ్గింది, డ్రామాలాడింది టీడీపీయేనని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
2019లో జగన్కు మద్దతిచ్చేందుకు పవన్ రెడీ, బాబుకు దూరం అందుకే: వరప్రసాద్ సంచలనం
పవన్ మద్దతిచ్చినా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు మద్దతు తెలిపినా, తెలపకున్నా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. పవన్ తమ పార్టీకి మద్దతు తెలుపుతారని వైసీపీ నేత వరప్రసాద్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఉమ్మారెడ్డి స్పందిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు. పవన్ మద్దతిస్తాడేమోనని, ఆయన పోటీ చేయకుండా మద్దతు ఇవ్వచ్చు, ఇలా ఇస్తే ఇవ్వనివ్వండి అని అన్నారు.