డోర్ డెలివరీ ఇస్తున్నారు: బాబుపై ఉమ్మారెడ్డి ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని వైయస్సార్ కాంగ్రెసు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రుణ మాఫీ అంశం రైతుల చేతుల్లో బాండ్లు పెట్టి, వారి చెవుల్లో పూలు పెట్టినట్లుగా ఉందని ఆయన అన్నారు.
ప్రభుత్వం, బ్యాంకర్లు కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. రైతులను ఎందుకు అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన అడిగారు. ఆంధ్రప్రదేశ్లో గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలకు విరుద్ధంగా అసత్యాలు వల్లిస్తున్నారని విమర్శించారు.
గాంధీ ఆశయాలకు, సిద్ధాంతాలకు విరుద్ధమైన పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుతోందని ఉమ్మారెడ్డి అన్నారు. మద్య నిషేధం అనే వ్యక్తి ఇప్పుడు డోర్ డెలివరీ ఇస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన వాగ్గానాలను ఎప్పుడు అమలు చేస్తారో కేలండర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కమిటీలు, చర్చల పేర్లతో కాలాయాపన చేయడం తెలుగుదేశం ప్రభుత్వానికి కూడదని ఆయన అన్నారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు మంత్రులను, అధికార పార్టీ ప్రతినిధులను నిలదీస్తారని ఆయన అన్నారు.