అనూహ్యంగా వరించిన పదవి:ఏవీ సుబ్బారెడ్డి...ఫుల్ ఖుషీ!
కర్నూలు:ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లో రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించబడిన ఏవీ సుబ్బారెడ్డి తనకు ఈ పదవి లభించడంపై ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రి అఖిలప్రియతో విభేదాల నేపథ్యంలో తీవ్ర అసహనంతో ఉన్న ఎవి సుబ్బారెడ్డి తనను అనూహ్యంగా వరించిన నామినేటెడ్ పదవితో సంతృప్తి చెందినట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోందంటున్నారు. విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్గా ప్రకటించిన తరువాత తొలిసారిగా మంగళవారం ఆళ్లగడ్డకు చేరుకున్నఎవి సుబ్బారెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం తన స్వగృహంలో ఏవి సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతి రెడ్డి, సన్నిహితులు,నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ఆశయాలను వమ్ము చేయనని అన్నారు. రాష్ట్రంలో 75 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏపీ సీడ్స్, నేషనల్ సీడ్స్ ఉన్నాయని, వీటి ద్వారా రైతులకు 40 శాతం విత్తనాలు సరఫరా అవుతున్నాయని...మిగిలిన శాతం రైతులే విత్తనాలు తయారు చేసుకుంటున్నారని వివరించారు.
అయితే రైతులు తయారు చేసుకున్న విత్తనాల ద్వారా సాగు చేస్తున్న పంటలపై దిగుబడి తగ్గుతోందని, ఈ విషయం గణాంకాలను బట్టి తెలుస్తోందని చెప్పారు. అందువల్ల సీడ్స్ కంపెనీల ద్వారానే నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసి రైతులు మంచి దిగుబడులను సాధించేలా చర్యలు తీసుకుంటామని ఎవి సుబ్బారెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలోనే జూపాడుబంగ్లా మండలం తంగడంచలో 600 ఎకరాల్లో రూ.700 కోట్లతో విత్తన హబ్ను ఐవా కంపెనీతో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
అలాగే వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సహకారంతో రైతన్నల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తాను 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నానని, అందువల్ల ప్రజలు,రైతుల అవసరాలపై అవగాహన ఉందన్నారు. రైతన్నలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.