నాన్నా..నా బిడ్డల భవిష్యత్తు చూడండి..పిల్లల స్కూలు ఫీజు కట్టలేక తల్లి ఆత్మహత్య
విజయవాడ:తన పిల్లలు బాగా చదువుకోవాలని ఆ తల్లి చాలా ఆశపడింది...ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పిల్లలను స్కూలుకు పంపించి చదివిస్తోంది...ఈ పరిస్థితుల్లోనే పిల్లలు...అమ్మా...స్కూలు ఫీజు కట్టాలన్నారు...చేతిలో చిల్లిగవ్వ లేదు...దీంతో పిల్లలకు స్కూలు ఫీజు కూడా కట్టలేని తన బతుకెందుకు అనుకుంది ఆ మాతృమూర్తి...ఆ విషయాన్నే సూసైడ్ నోట్ రాసి ఉరేసుకొని చనిపోయింది...తన చివరి లేఖలో పిల్లల భవిష్యత్తు గురించి తన తండ్రికి జాగ్రత్త చెబుతూ ఆ తల్లి రాసిన రాతలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి.
అసలే మధ్య తరగతి కుటుంబం...దానికి తోడు కట్టుకున్నోడు వదిలేశాడు...ఫలితంగా ఆర్థిక కష్టాలు...అయినా ఎలాగో పిల్లలను చదివిస్తోంది...అయితే పిల్లల స్కూలు ఫీజులు కూడా కట్టలేని దైన్య స్థితి...ఇలాంటి పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలని అడుగుతుండటంతో...ఏం చెయ్యాలో తోచని ఆ తల్లి విరక్తితో ఆత్మహత్యకు పాల్పడింది. విజయవాడ నగరంలో వెలుగు చూసిన విషాద ఘటన వివరాలు ఇవి...
పెళ్లి...ఇల్లు...వివాదం...వదిలివెళ్లిపోయిన భర్త
విజయవాడ రామకృష్ణాపురం ఫస్ట్ లైన్లో నివసించే గోళ్ల సాయి ప్రియాంక (34)కు ఏడేళ్ల క్రితం ఫొటో స్టూడియో నిర్వాహించే శ్రీనివాసరావుతో పెళ్లయింది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. అయితే వివాహ సమయంలో సాయి ప్రియాంకకు పసుపు కుంకుమగా తండ్రి రామకృష్ణాపురంలోని ఓ ఇల్లు రాసిచ్చారు. అయితే భర్త ఆ ఇల్లు అమ్ముదామంటూ గొడవ పడుతుండటంతో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ప్రియాంక ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తోంది. అయితే తనకు కట్నంగా ఇచ్చిన ఇల్లు విషయంలో భార్య తన మాట వినడం లేదన్న కోపంతో భర్త శ్రీనివాసరావు తొమ్మిది నెలల క్రితం భార్యను వదిలి వేరుగా వెళ్లిపోయాడు.
ఆర్థిక ఇబ్బందులు...పిల్లల స్కూలు ఫీజు కట్టలేక...
అయితే, భర్త ఒక్కసారిగా వదిలి వెళ్లడంతో అప్పటికే స్కూల్లో చదువుతున్నపిల్లలకు ఫీజులు కట్టేందుకు కూడా సాయి ప్రియాంక వద్ద డబ్బులు లేని పరిస్థితి ఎదుర్కొంటోంది. దీంతో తన ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్పై బెంగ పెట్టుకుంది. ఆ తరువాత ఏమి ఆలోచించిందో ఏమో...తన ఇద్దరు పిల్లలకు హార్లిక్స్ కలిపి ఫ్లాస్క్ లో పోసిచ్చి అమ్మమ్మ ఇంటికి వెళ్లి తాగండని చెప్పింది. తల్లి చెప్పిన విధంగా అమ్మమ్మ ఇంటికి వెళ్లి హార్లిక్స్ తాగి ఆటలాడుకొని పిల్లలు తిరిగి ఇంటికి చేరారు. అయితే తలుపులు ఎంత కొట్టినా అమ్మ తలుపు తీయకపోవడంతో మళ్లీ అమ్మమ్మ ఇంటికి వెళ్లి విషయం చెప్పారు.
అప్పటికే చనిపోయింది...సూసైడ్ నోట్ రాసింది...
దీంతో ఆమె గాభరాగా తిరిగి వచ్చి తలుపులు బాదినా కూతురు తలుపులు తీయకపోవడంతో స్థానికులకు విషయం చెప్పి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే సాయి ప్రియాంక ఉరేసుకొని చనిపోయిఉంది. అయితే చనిపోయేముందు తన త్రండ్రిని ఉద్దేశించి ఆమె రాసిన సూసైడ్ నోట్ అక్కడ ఉంది...అందులో ఏమని రాసిందంటే...
నాన్మా...నన్ను క్షమించు...నా బిడ్డల భవిష్యత్తు మీరే చూడాలి...
"నాన్నా...నన్ను క్షమించండి...నేను ఆత్మహత్య చేసుకుని తప్పు చేస్తున్నాను...నా బిడ్డల భవిష్యత్తు మీరే చూడాలి...వివాహ సమయంలో మీరు నాకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఇల్లు అమ్మేసి...ఆ డబ్బును నా ఇద్దరు ఆడ పిల్లల పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి దాంతో పాటు వాళ్లని బాగా చదివించండి...వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రయోజకులను చేస్తారు కదూ"...అంటూ లేఖ రాసి పెట్టింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.