మున్సిపల్ పోరులోనూ ఏకగ్రీవాల జోరు- కడప రికార్డులు- పులివెందుల క్లీన్స్వీప్
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోరు ప్రారంభమైన తొలిరోజే సంచలనాలు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో అవకాశం కోల్పోయిన వారు భారీ సంఖ్యలో నామినేషన్లు వేస్తారని భావించినా అలా జరగలేదు. కానీ భారీ ఎత్తున ఏకగ్రీవాలు మాత్రం నమోదయ్యాయి. రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 222 ఏకగ్రీవాలు నమోదు కావడం విశేషం. ఇందులోనూ దాదాపు సగం ఏకగ్రీవాలు సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలోనే చొటు చోసుకోవడం మరో విశేషం. దీంతో మున్సిపల్ ఎన్నికలపైనా అధికార పక్షం ప్రభావం మరోసారి తేటతెల్లమైంది.
Recommended Video
మున్సిపల్ పోరులోనూ ఏకగ్రీవాల జోరు
ఏపీలో గతేడాది కరోనా కారణంగా ఆగిపోయి తిరిగి నిన్న ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోరులో తొలిరోజే సంచలనాలు నమోదయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాల ప్రభావం కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏకగ్రీవాలు ఓ ఎత్తయితే సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఏకగ్రీవాలు మరో ఎత్తుగా మారాయి.
పులివెందుల పురపాలక సంఘంలో అయితే పరిస్ధితి చెప్పాల్సిన అవసరమే లేకుండా పోయింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరగబోతోందో తొలిరోజు లెక్కలే చెప్పేశాయి. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అధికార పార్టీ పూర్తిస్ధాయిలో తమ హవా కొనసాగిస్తున్నట్లు దీన్ని బట్టి అర్ధమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 222 ఏకగ్రీవాలు
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు రాష్టవ్యాప్తంగా 222 సీట్లు ఏకగ్రీవమయ్యాయి. ఆయా చోట్ల సింగిల్ నామినేషన్లు మాత్రమే మిగిలాయి. వీరంతా వైసీపీ రెబెల్ అభ్యర్ధులే కావడం మరో విశేషం. రాయలసీమలోని కడప, నంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా వైసీపీ రెబెల్స్ నామినేషన్ల ఉపసంహరణ తర్వాత సింగిల్ నామినేషన్లే మిగిలాయి. అంతకు ముందే పలు చోట్ల ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధులు నామినేషన్ కూడా వేయకుండానే వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఉపసంహరణల తర్వాత రాయలసీమలో వైసీపీ క్లీన్స్వీప్ చేసే పరిస్ధితి కనిపిస్తోంది.
రికార్డులు బద్దలు కొడుతున్న కడప
నిన్న నామినేషన్ల ఉపసంహరణల తర్వాత ఏకగ్రీవమైన వాటిలో సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడపలో అత్యధికం ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలో ఒక్కరోజులోనే 100 ఏకగ్రీవాలు నమోదుకావడం విశేషం. అందులోనూ జగన్ నియోజకవర్గం పులివెందులలో అయితే అన్ని చోట్లా సింగిల్ నామినేషన్లే దాఖలు కావడం మరో విశేషం. దీంతో పులివెందుల మున్సిపాలిటీ రాష్ట్రంలో పూర్తి ఏకగ్రీవాలతో రికార్డు సృష్టించబోతోంది. మొత్తం మీద కడప జిల్లా మున్సిపల్ ఎన్నికల ఏకగ్రీవాల రేసులో మిగతా జిల్లాల కంటే ఎంతో ముందుంది.
2472 నామినేషన్ల ఉపసంహరణ
రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభమైన తొలిరోజు 2472 మంది అభ్యర్ధులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. గతంలో నామినేషన్లు వేసిన వీరంతా నిన్న ఒక్కరోజులోనే నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వీరిలో అత్యధికులు పార్టీ అభ్యర్ధులకు డమ్మీ నామినేషన్లు వేసిన వారు, రెబెల్స్ కూడా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు మిగిలి ఉండటంతో మరికొంత మంది నామినేషన్లు వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నారు. అనంతరం అదికారులు బరిలో మిగిలిన అభ్యర్ధుల వివరాలను ప్రకటిస్తారు.