'పోలీసుమయంగా అమరావతి.. అప్రకటిత ఎమర్జెన్సీ..'
మూడు రాజధానుల ప్రతిపాదనతో వైసీపీ ప్రభుత్వం అమరావతిలో యుద్ద వాతావరణం తీసుకొచ్చిందని మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేబినెట్ మీటింగ్ పేరుతో 29 గ్రామాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ తీసుకొచ్చారని ఆరోపించారు. విధి విధానాలను ప్రశ్నిస్తే జగన్ తట్టుకోలేకపోతున్నారని,అణచివేతతోనే అధికారాన్ని చలాయిస్తున్నారని విమర్శించారు. ఓట్లు వేసినవాళ్లనే కాళ్లతో తొక్కుకుంటూ వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుమయంగా అమరావతి..
అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా పోలీసుమయం చేశారని.. నెల్లూరు,ప్రకాశం జిల్లాల నుంచి వేలాదిమంది పోలీసులను అక్కడ దించారని ఆరోపించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులే మీకు దొంగలుగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. రైతుల ఇంటి తలుపులకు నోటీసులు అంటించేంత తప్పు వారేం చేశారని నిలదీశారు.
జగన్ నియంతృత్వ ధోరణి..
జగన్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని,రాజధాని గ్రామాల్లో యుద్ద వాతావారణాన్ని సృష్టిస్తున్నారని యనమల విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన రాజధానిని ఎలా మారుస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని గౌరవించని ముఖ్యమంత్రిని ఇంతకుముందెప్పుడూ చూడలేదన్నారు.
స్వార్థ ప్రయోజనాల కోసమే విశాఖ..
తన స్వార్థ ప్రయోజనాల కోసమే జగన్ విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తున్నారని యనమల ఆరోపించారు. ఆరు నెలల ముందు నుంచే వైసీపీ రౌడీలు అక్కడి భూములపై కన్నేశారని ఆరోపించారు. అక్కడ భారీ ఎత్తున ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. గత ఏడు నెలల్లో వుడా పరిధిలో జరిగిన భూ కొనుగోళ్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలన్నారు.
రేపు కేబినెట్ భేటీ.. అమరావతిలో భారీ భద్రత
జీఎన్ రావు కమిటీ మూడు రాజధానుల ప్రతిపాదన నేపథ్యంలో శుక్రవారం కేబినెట్ భేటీ జరగనుంది. కమిటీ ప్రతిపాదనకు కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అయితే రాజధాని ప్రాంత రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుండటంతో.. కేబినెట్ భేటీని సచివాలయంలో కాకుండా తాడేపల్లిగూడెంలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ భేటీ నేపథ్యంలో అదనపు పోలీస్ సిబ్బందిని రప్పించి భద్రతా ఏర్పాట్లు చేయిస్తున్నారు.