అలా చేస్తే మోడీనే పడగొట్టేయొచ్చు...చంద్రబాబుకు ఉండవల్లి అదిరేటి సలహా…
Recommended Video
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిందంటున్ననరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం చంద్రబాబు చేతుల్లో ఉందని అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్. చంద్రబాబు నిజంగా మోడీకి బుద్ది చెప్పాలనుకుంటే అందుకు ఇదే సరైన తరుణమంటున్నారు ఈ మాజీ ఎంపి.
మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే 10 మంది ఆ పార్టీ ఎంపీలు తిరుగుబాటు చేశారని...ఎన్డిఎలో ఉన్న చంద్రబాబు ఈ అవకాశం ఉపయోగించుకుని ఏపీకి అన్యాయం చేస్తున్న మోడీ సర్కార్ ను గద్దె దించాలని ఉండవల్లి సలహా ఇచ్చారు.బడ్జెట్ లో మోడీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బిజెపి నేతలు యాశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా నేతృత్వంలో సమావేశం నిర్వహించారని...చంద్రబాబు వారితో జత కలిసి ఏపీ ప్రయోజనాలకోసం పోరాడాలని ఉండవల్లి అరుణ కుమార్ సూచించారు.
కేంద్ర ఆరోగ్యశ్రీకి...నిధులెలా?...ఇది మరో మాయ...
దేశంలో పేదలందరికీ ఆరోగ్య రక్షా పథకంలో ఐదు లక్షల రూపాయల వైద్యం ఉచితమని...దీనికి బడ్జెట్ కేటాయింపు వెయ్యి కోట్లని పేర్కొన్నారని...అయితే 50 కోట్ల మందికి ప్రీమియం ఎంత అవుతుందనే విషయమై ప్రభుత్వ ఆర్ధిక కార్యదర్శి ఒకలాగా...ఆర్ధికవేత్తలు మరోలాగా లెక్కలు చెబుతున్నారని ఉండవల్లి విశ్లేషించారు. ఈ పథకంకు సంబంధించి ఒకసారి రాష్ట్రం 40 శాతం కేంద్రం 60 శాతం అంటున్నారని, ఇది ప్రజలను మాయ చేయడం తప్ప మరొకటి కానేకాదన్నారు ఉండవల్లి. గతంలో ఎపిలోనే వైఎస్ ఆరోగ్య శ్రీకి 50 కోట్ల రూపాయలతో మూడు జిల్లాలకు ఈ పథకం పైలెట్ ప్రాజెక్ట్ గా పెట్టారని...ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 450 కోట్లు...అనంతరం 920 కోట్లు చొప్పున ఏడాదికి బడ్జెట్ కేటాయింపులు చేశారని ఉండవల్లి గుర్తు చేశారు. ఈ లెక్కన కేంద్ర ఆరోగ్య శ్రీకి దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ ఎంత కేటాయించాలో లెక్కించాలని ఉండవల్లి కోరారు. బడ్జెట్ లో చేర్చకుండా డబ్బులు గాల్లో నుంచి వస్తాయా అని ఉండవల్లి ప్రశ్నించారు.
పార్లమెంట్ లోపల చేయకుండా...బైటచేస్తే...ఏం ప్రయోజనం?...
ఏపీకి గత నాలుగేళ్లుగా కేంద్రం లోని ఎన్టీఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు దక్కకపోయినా పార్లమెంట్ లోపల పోరాటం చెయ్యడం మానేసి...బైట గొడవ చేస్తే ప్రయోజనం ఏమిటని...లోపల పోరాడటానికి భయమా అని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. అసలు బాబు పోరాడటానికి అడ్డం ఏమిటని...ఇచ్చిన నిధులు కమీషన్లుగా నొక్కేస్తున్నారని ఢిల్లీ లో తనతో ఒక ఆర్ఎస్ఎస్ నేత వ్యాఖ్యానించారని...అలాంటివి ఏమైనా ఉన్నాయా అని ఉండవల్లి అడిగారు. బాబు కేసులకు, జైళ్లకు భయపడటం మానేయాలని...దేశంలో జ్యుడీషియరీని మ్యానేజ్ చేయడంలో బాబు తరువాతే ఎవరైనా కనుక...ఆయన కేసీఆర్ తరహాలో ఎదురుదాడికి దిగాలని సూచించారు ఉండవల్లి. ఇప్పటికైనా సమయం మించి పోలేదని...ఇప్పుడైనా ఏమి చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసని...ఆ ప్రకారం చేసి...రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా రావలిసిన నిధులు రాబట్టాలన్నారు. ఈ తరుణంలో పోరాటానికి వెనకతీసి చరిత్ర హీనులు గా మారవద్దని...ఆ పరిస్థితి తెచ్చుకోకండని చంద్రబాబుకు ఉండవల్లి హితవు పలికారు.
కొత్తగా చేసిందేమీ లేదు...నాలుగేళ్లుగా ఇదే తంతు...
ఆంధ్రప్రదేశ్ కి గడచిన నాలుగేళ్లుగా అన్యాయమే జరుగుతోందని, ఇప్పుడు కొత్తగా ఏదో ఘోరం జరిగినట్లుగా మాట్లాడటం విచిత్రంగా ఉందని ఉండవల్లి టిడిపిపై వ్యంగాస్త్రాలు సంధించారు. ఇప్పటికైనా టిడిపి పోరుబాట పట్టడం స్వాగతిస్తున్నానన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో కాకినాడలో ఏర్పాటు చేస్తామని చెప్పిన పెట్రోలియం రిఫైనరీ ఇప్పుడు ముంబయిలో నిర్మిస్తామని చెప్పడం నిజంగా చాలా దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తావనే బడ్జెట్ లో లేదని, కనీసం నాబార్డ్ కి కేటాయింపులు కూడా లేవని ఉండవల్లి కేంద్రం పై ధ్వజమెత్తారు. దుగ్గరాజపట్నం 6 నెలల్లో పూర్తి చేయాలని చట్టంలో ఉంటే దాని గురించి ఊసే లేదని, ఏపీలో ప్రధాన ఆదాయం వ్యవసాయం,పోర్ట్ లనుంచి మాత్రమే అని...ఎపికి ప్రాణాధారమైన వాటికి కూడా గండికొడితే ఎలా అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్...కాల్షీట్లు అయిపోయినట్లున్నాయి...
ఎపిలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు టిడిపి, వైసిపి కేంద్రంలో సరెండర్ అయిపోయాయని అనుకుని...పవన్ కల్యాణ్ జనసేన వైపు చూస్తే ఆయన కూడా అలాగే ఉన్నారని ఎద్దేవా చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. నిజానికి కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిన విషయాన్ని ఎత్తిచూపే అవకాశం రావడం పవన్ పార్టీకి ఒక సువర్ణావకాశం లాంటిదని...కానీ ఆయన తెలంగాణ, ఏపీలో తిరిగి...అంతటితో కాల్షీట్లు అయిపోయినట్లు సైలెంట్ అయిపోవడం దారుణం అన్నారు. తనకు ప్రస్తుతం ఏ పార్టీతో మిత్ర ధర్మం లేదని...ప్రజలకు ఏది మంచో అదే చెబుతానని... అందుకోసమే ప్రభుత్వాలను ప్రశ్నిస్తానని అన్నారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్.