కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి, 1996 నుంచి.. ఇదీ చంద్రబాబు!: ఉండవల్లి షాకింగ్ కామెంట్స్
విశాఖపట్నం: ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు తాను సరిపోనని, ఇప్పుడు అందరూ సంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారని మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం చెప్పారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో ఉండవల్లి సహా పలువురు ఉత్తరాంధ్ర మేధావులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం సంపాదించుకునేందుకే రాజకీయాలను వాడుకుంటున్నారని ఆయన వాపోయారు. దేశంలో ఓటుకు వేలంపాట జరుగుతోందని చెప్పారు. అవినీతి విషయంలో ప్రజలలో చైతన్యం రావాలని చెప్పారు. రూ.20 కోట్లు ఖర్చు పెడితేనే అసెంబ్లీలో అడుగు పెట్టే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నేనెక్కడి నుంచి పోటీ చేస్తానో చెబుతా, జగన్ చెప్పినంత మాత్రాన కాదు: పవన్ కళ్యాణ్
చంద్రబాబు గురించి షాకింగ్ కామెంట్స్
ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. రాజకీయ పార్టీలు, ఆయా నాయకులు ప్రతి పనిని నేతలు పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారన్నారు. 1996లో రెడ్డి సుబ్రహ్మణ్యం అనే ఐఏఎస్ అధికారి తూర్పు గోదావరి జిల్లాకు కలెక్టర్గా పని చేసేవారని తెలిపారు. అప్పట్లో తుఫాను వస్తుందని రేడియో ద్వారా తెలుసుకున్న రెడ్డి సుబ్రహ్మణ్యం నాటి సీఎం చంద్రబాబుకు చెప్పకుండానే ముందుగా జిల్లాలో పర్యటించారని, ఈ సందర్భంగా వరదలో కొట్టుకుపోయిన ఓ గేదెను గ్రామస్థులతో కలిసి కాపాడారని చెప్పారు.
కళ్లవెంట నీళ్లు తిరుగుతున్నాయి
దీనికి సంబంధించిన ఫొటోను ఆ తర్వాత రోజు పేపర్లో చూసిన చంద్రబాబు వెంటనే ఆ అధికారిని సస్పెండ్ చేశారని ఉండవల్లి చెప్పారు. తాను ఘటనాస్థలానికి వెళ్లకముందే రెడ్డి సుబ్రహ్మణ్యం వెళ్లడంతో అలా కొరడా ఝుళిపించారన్నారు. అందుకే పని చేస్తే తలనొప్పి వస్తుంది అన్న భావన, భయం ఆంధ్రప్రదేశ్ అధికారుల్లో నెలకొని ఉందని చెప్పారు. ఏపీ ప్రభుత్వంలో ఉన్నతస్థానాల్లో పని చేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం చెబుతున్న విషయాలు వింటే కళ్ల వెంట నీళ్లు తిరుగుతున్నాయని చెప్పారు.
ప్రచార ఆర్భాటం కోసమే చంద్రబాబు గెస్ట్ హౌస్లో నిద్రించలేదు
ప్రభుత్వాలు ఈ రకంగా అవినీతికి పాల్పడతాయా అని ఆశ్చర్యం కలుగుతోందని ఉండవల్లి అన్నారు. విశాఖపట్నం జిల్లాను హుధుద్ తుపాను వణికించిన సందర్భంగా అతిథి గృహంలో నిద్రించడానికి చంద్రబాబు నిరాకరించారని చెప్పారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే చంద్రబాబు ఆ పని చేశారన్నారు. బస్సులో పడుకున్నారని మండిపడ్డారు. తాను కష్టపడుతున్నట్లు ప్రజల్లో ఒక భావన కలిగించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారన్నారు.
ఏపీలో భారీ అవినీతి
ఏపీలో భారీ అవినీతి చోటుచేసుకుంటోందని ఉండవల్లి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ఆదరణ పథకం కింద రూ.లక్ష వ్యయంతో వీడియోకాన్ వాషింగ్ మెషీన్ను కొనుగోలు చేస్తోందని, అదే మెషీన్ మార్కెట్లో రూ.75,000కే దొరుకుతుందని చెప్పారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అన్న క్యాంటీన్లలో భోజనం పరిమాణంలో తేడా కొంచమే ఉన్నప్పటికీ ధరలు మాత్రం మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇవన్నీ బహిరంగ రహస్యాలే అన్నారు. వీటిపై ఎవరూ చర్చించడం లేదన్నారు. కాంట్రాక్టులు, ప్రాజెక్టుల ద్వారా సంపాదించుకున్నది చాలక ఇప్పుడు ఆదరణ, మధ్యాహ్న భోజనం వంటి పథకాల్లో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఈ స్థాయిలో అవినీతికి పాల్పడిన ప్రభుత్వాన్ని తన జీవితంలో చూడలేదన్నారు.
టీడీపీ మిత్రులు చెప్పారు
కొందరు తెలుగుదేశం పార్టీ మిత్రులు ఈ విషయమై తనకు ఫోన్ చేశారని, మమ్మల్ని ఏం చేయమంటావని, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకుంటే గెలవలేని పరిస్థితి ఉందని, ఇలా సంపాదించకపోతే కష్టమని తనతో చెప్పారని ఉండవల్లి అన్నారు. ప్రభుత్వ అవినీతిని కట్టడి చేసేందుకు యువత ముందుకు రావాలన్నారు. ఉత్తరాంధ్ర మేధావులు ఇందుకు సాయం చేస్తారన్నారు. ఏపీలో రూ.20 కోట్లు ఖర్చు పెడితే కానీ అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి లేదన్నారు.