రామోజీరావుకు పద్మ విభూషణ్ ఎలా ఇస్తారు?: హైకోర్టులో ఉండవల్లి పిల్
హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించడాన్ని ప్రశ్నిస్తూ రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రామోజీరావుకు పద్మ విభూషణ్ అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఉండవల్లి ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు, వ్యక్తిగత హోదాలో రామోజీరావును ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్పై హైకోర్టులో ఎప్పుడు విచారణ జరగనుందన్న విషయం మాత్రం ఇంకా తేలలేదు.
గతంలో కూడా రామోజీరావును ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకు ఈడ్చిన సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరిట ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ గతంలో ఏళ్ల తరబడి న్యాయ పోరాటం సాగించారు. ఈ పోరాటానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దన్నుగా నిలిచారు.
హైకోర్టు శాశ్వత జడ్జీలుగా పదిమంది ప్రమాణం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పది మంది న్యాయమూర్తులు బుధవారం శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే బుధవారం మధ్యాహ్నం వీరితో ప్రమాణం చేయించారు.
ప్రమాణం చేసిన వారిలో జస్టిస్ ఆశపు రామలింగేశ్వరరావు, జస్టిస్ బులుసు శివశంకరరావు, జస్టిస్ మంథాట సీతారామ్మూర్తి, జస్టిస్ సారిపల్లె రవికుమార్, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ మిస్రిలాల్ సునీల్ కిషోర్ జైశ్వాల్, జస్టిస్ అంబటి శంకరనారాయణ, జస్టిస్ అనిస్లు ఉన్నారు.