పవన్ ను సీఎం చేస్తామంటేనే ? జనసేనతో పొత్తు లేకుంటే టీడీపీ బలి ? ఉండవల్లి హాట్ కామెంట్స్ !
ఏపీలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను కలుపుతున్న పవన్ కళ్యాణ్.. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిపోయారు. అదే సమయంలో విపక్షాల్ని ఏకతాటిపైకి తెచ్చి వైసీపీని గద్దెదించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రధాన విపక్షం టీడీపీకి ఆయన ఓ కీలక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు ఒప్పుకుంటే టీడీపీ-జనసేన పొత్తు కుదిరే అవకాశమున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ వెల్లడించారు.
ఉండవల్లి హాట్ కామెంట్స్
ఏపీలో పొత్తుల రాజకీయం రోజుకో విధంగా మారుతున్న తరుణంలో విపక్ష పార్టీలైన టీడీపీ-జనసేన పొత్తుకు సంబంధించి పలు విశ్లేషణలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఇప్పటికే బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన దాన్ని వదిలిపెట్టి టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా లేక అలాగే కొనసాగుతూ పొత్తుకు రెడీ అవుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో ముందుగా టీడీపీ-జనసేన పొత్తుకు సంబంధించి జరుగుతున్న ప్రయత్నాలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక విశ్లేషణ చేశారు. దీనిపై ఉండవల్లి చేసిన హాట్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.
పవన్ సీఎం అంటేనే పొత్తు ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా తెలివైన వ్యక్తి అని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.
తనని సీఎం అభ్యర్ధిగా ప్రకటించకుండా టీడీపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారని తాను అనుకోవట్లేదని ఉండవల్లి వెల్లడించారు. అందుకు టీడీపీ ఒప్పుకోకపోతే పవన్ కళ్యాణ్ కి కొత్తగా పోయేది ఏమీ లేదని ఆయన విశ్లేషించారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన పొత్తుకు సీఎం పదవి కీలకంగా మారబోతోందని విశ్లేషణలు వినిపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ సీఎం పదవి ఇస్తేనే పొత్తు పెట్టుకుంటారని ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
టీడీపీ-జనసేన పొత్తు లేకపోతే ?
అలాగే రాష్ట్రంలో సీఎం పదవి కారణంగా టీడీపీ-జనసేన పొత్తు కుదరకపోతే మాత్రం జరిగేదేంటో కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పేశారు. వీరిద్దరి మధ్య పొత్తు కుదరకపోతే కచ్చితంగా సీఎం జగన్ టీడీపీని భూస్దాపితం చేస్తారని కూడా ఉండవల్లి హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీని టార్గెట్ చేసుకుని కక్షా రాజకీయాలు చేస్తున్నారని జగన్ పై విమర్శలు వినిపిస్తున్న వేళ భవిష్యత్తులో జరగబోయేది కూడా ఇదేనని ఉండవల్లి జోస్యం చెప్పేశారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తుపై ప్రాధాన్యం మరింత పెరిగింది.
చంద్రబాబు తగ్గితేనే ?
రాష్ట్రంలో టీడీపీ-జనసేన పొత్తు లేకపోతే కచ్చితంగా సీఎం జగన్ టీడీపీని భూస్దాపితం చేస్తారని జోస్యం చెప్పిన ఉండవల్లి.. అందుకోసం చంద్రబాబు ఏం చేయాలన్నది కూడా చెప్పేశారు. పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే చంద్రబాబే ఒక అడుగు వెనక్కి వేసి పవన్ కళ్యాణ్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందేమో అని ఉండవల్లి అరుణ్ కుమార్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంటే పవన్ ను సీఎంగా ప్రకటించి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లకపోతే జగన్ చేతిలో చావుదెబ్బ తప్పదనే హెచ్చరికల్ని ఉండవల్లి పరోక్షంగా చేసినట్లయింది.