జగన్ కనుసన్నల్లో రాజమండ్రిలో ఉండవల్లి, ఢిల్లీలో కేవీపీ నాటకాలు .. దేవినేని ఉమా ఫైర్
Recommended Video
ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ పై మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకపక్క కేవీపీ , మరోపక్క ఉండవల్లి పోలవరం ప్రాజెక్ట్ పై మూకుమ్మడి దాడికి దిగారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సదరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం చెప్పారు మంత్రి దేవినేని ఉమా .
జగన్ కనుసన్నల్లోనే పోలవరంపై జరుగుతున్న రాద్దాంతమన్న దేవినేని ఉమా
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జరుగుతున్న రాద్ధాంతం అంతా జగన్ కనుసన్నల్లో జరుగుతుందని మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు . జగన్ కు లబ్ది చేకూర్చటానికి కేవీపీ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు రాజమండ్రి కొట్టుకుపోతుందని అసత్యప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఉండవల్లి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు దేవినేని ఉమా . ఈ మధ్య సదరు నేతకు వైసీపీ పై వల్లమాలిన ప్రేమ పుట్టుకొస్తుంది, అంత ప్రేముంటే వెళ్లి పార్టీలో చేరండి కానీ ఇలా ప్రజలను పక్కదారి పట్టించకండి అంటూ ఉండవల్లి పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు .
కేసీఆర్, జగన్ దర్శకత్వంలో పోలవరం విషయంలో నాటకాలు ఆడుతున్నారన్న మంత్రి ఉమా
పోలవరం ప్రాజేక్ట్ విషయంలో చంద్రబాబును, ఏపీ ప్రభుత్వాన్ని యక్ష ప్రశ్నలు వేస్తున్న వైసీపీ నేతలు, జగన్ , పోలవరానికి అడుగడుగునా కేసీఆర్ అడ్డు వస్తుంటే ఎందుకు ప్రశ్నించటం లేదంటూ మండిపడ్డారు. పోలవరం పూర్తైతే భద్రాచలం మునిగిపోతుందని కేసీఆర్ కేసులు వేస్తున్నారని ఇదంతా జగన్ కు, జగన్ పార్టీ నేతలకు తెలీదా అని ఉమా ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఇచ్చే పైసల కోసం జగన్ నోరు విప్పరని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్, జగన్ దర్శకత్వంలో వైసీపీ నేతలు, మద్దతుదారులు అందరూ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. పోలవరానికి సంబంధించి ఎవరికి ఏ సమాచారం కావాలన్నా ప్రాజెక్టు అధికారులు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారని చెప్పారు. ప్రాణాలకు తెగించి కార్మికులు పనులు చేస్తుంటే రాళ్లేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పోలవరంపై విషం చిమ్మే ప్రయత్నాలు మానుకోవాలని దేవినేని సదరు నేతలకు హితవు చెప్పారు .
రాజమండ్రిలో ఉండవల్లి, ఢిల్లీలో కేవీపీ జగన్ కోసం నాటకాలు .. అసత్య ప్రచారాలు అని మండిపాటు
పోలవరం ప్రాజెక్ట్ పై ఇన్ని రకాలుగా స్పందిస్తున్న కేవీపీ కేసీఆర్, కవిత పోలవరానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేసినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కావాలనే పోలవరంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్ కు లబ్ధి చేకూర్చడానికి కేవీపీ శతవిధాలా ప్రయత్నించారని ఆరోపించారు. జగన్ కనుసన్నల్లో ఇక్కడ రాజమండ్రిలో ఉండవల్లి, ఢిల్లీలో కేవీపీ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమా . జాతీయ ప్రాజెక్టును ఒక్కసారైనా ప్రధాని, ప్రతిపక్ష నేత వచ్చి చూసారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ జీవ నాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చెయ్యాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంటే కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని ఉమా అన్నారు.