ఏపీ సచివాలయంలో ఉండవల్లి అరుణ్ కుమార్! చంద్రబాబుతో భేటీ
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం సాయంత్రం అమరావతిలోని సచివాలయానికి వచ్చారు. అయితే, ఆయన సీఎంఓ ఆహ్వానం మేరకే ఇక్కడికి రావడం గమనార్హం.
అంతేగాక, ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. కాగా, ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సచివాలయానికి రావడం ఇది రెండోసారి. మొదటిసారి నిర్మాణ సమయంలో సచివాలయాన్ని చూసేందుకు వచ్చారు.
విభజన హామీల అమలు, పార్లమెంటులో పోరాటంపై గతంలో చంద్రబాబుకు ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరు, కేంద్రంపై అవిశ్వాసం వంటి అంశాలపై చంద్రబాబు.. ఉండవల్లి సలహాలను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి దూరమైన ఉండవల్లి గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ విభజన హామీలు, రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబుతో తాజా భేటీ ఆసక్తికరంగా మారింది.