చంద్రబాబుపై నిప్పులు: 'భ్రమరావతి' పేరుతో బుక్లెట్ విడుదల చేసిన ఉండవల్లి
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీని బుట్టదాఖాలు చేశారని అన్నారు.
స్విల్ ఛాలెంజ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వడం సరికాదని, ఆ దేశానికి అంత గొప్ప చరిత్ర లేదని అన్నారు. ఎంతో చిన్న దేశమైన సింగపూర్తో స్విస్ ఛాలెంజ్ పధ్ధతి అంటూ ఒప్పందాలు చేసుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు.
సింగపూర్ పేరును జపిస్తూ ఏపీ ప్రభుత్వ నానా హంగామా చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా 'భ్రమరావతి' పేరుతో బుక్లెట్ను విడుదల చేశారు. రాజధానికి శంకుస్థాపన చేసి ఏడాది గడిచిపోయిందని మోడీ వచ్చి మట్టి, నీళ్లు ఇచ్చి శంకుస్థాపన చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
రాజధాని నిర్మాణంపై హడావుడి తప్పా మెరుగైన పనితీరులేదని ఆయన ఆరోపించారు. సింగపూర్లాగా మన రాష్ట్రాన్ని మార్చేస్తామని ప్రజలకు చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటున్న సింగపూర్ కంపెనీలు అంత సమర్థవంతమైనవి కాదని అన్నారు.
ఏపీలో రాజధానిని ఒకచోట, హైకోర్టు ఒకచోట కట్టాలని శివరామన్ కమిటీ సూచించిందని దానిని బట్టే చంద్రబాబు నడుచుకోవాలని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణం కోసం భారీ ఎత్తున భూసేకరణ చేస్తున్నారని, అంత భూమి అవసరం లేదని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై వచ్చె నెల 11న పుస్తకం విడుదల చేస్తానని అన్నారు.