జగన్కు అంత లేదు, పవన్ కళ్యాణ్ గురించి చెప్పలేం: ఉండవల్లి
అమరావతి: వచ్చే ఎన్నికల్లో ప్రధానమైన పోటీ టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంటుందని మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. జగన్ సభలకు సినిమా నటుడిని చూసేందుకు వచ్చినట్లు జనం వస్తున్నారని భావించినా, ఎన్నికలు వచ్చేసరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల నిర్వహణ, రాజకీయ వ్యూహాల ముందు ఆయన తట్టుకోలేరన్నారు.
బుధవారం ఢిల్లీలో ఆంధ్రా జర్నలిస్టు అసోసియేషన్ నిర్వహించిన 'మీట్ ద ప్రెస్'లో మాట్లాడారు. గత ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని ప్రచారం చేశారని, కానీ లెక్కలు తేలేసరికి టీడీపీ గెలిచిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడే చెప్పడం కష్టమని తెలిపారు. 2014లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు బీజేపీ పరిస్థితి అలాగే ఉందన్నారు.
పవన్ కళ్యాణ్పై జగన్ వ్యాఖ్యలు, కాపునాడు తీవ్ర హెచ్చరిక
ప్రత్యేక హోదాతో వారికి ప్రయోజనం లేకపోవచ్చు కానీ
ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు భావోద్వేగంగా మారి రాజకీయాలను నిర్దేశిస్తోందని ఉండవల్లి చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేకపోవచ్చునని, కానీ ఏపీకి ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. రాయితీలు వేరు, ప్రత్యేక హోదా వేరు కాదన్నారు. 2014 ఫిబ్రవరి 20న చర్చ ప్రకారం హోదా వస్తే పారిశ్రామిక ప్రోత్సహకాలు వస్తాయన్నదే అందరి అభిప్రాయమన్నారు. అందుకే అప్పుడు అయిదేళ్లు హోదా అంటే.. వెంకయ్య పదేళ్లు కావాలని పట్టుబట్టారన్నారు.
టీడీపీ అలా చెప్పి ఉండాల్సింది
రాష్ట్ర విభజనను తాను వ్యతిరేకించడం లేదని, విభజన చేసిన తీరునే ప్రశ్నించాలని చెబుతున్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అశాస్త్రీయంగా, అప్రజాస్వామికంగా విభజన జరిగిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోకసభలో అన్నప్పుడు తెరాస సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారని, అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీయే అలా అన్నారని టీడీపీ గుర్తుచేస్తే బాగుండేదన్నారు.
ప్రత్యేక హోదా ఇస్తుందని భావిస్తున్నాను
నష్టం జరుగుతుందని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని ఉండవల్లి అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చిందని, మళ్లీ కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా వాగ్దానం నెరవేర్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయాల్లో ఉన్నా కానీ ఏ పార్టీలో లేను
రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఎవరైనా అంటే మెంటల్గా తేడా ఉన్నట్లేనని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. తాను రాజకీయాల్లో ఉన్నానని, కానీ ఏ పార్టీలోనూ లేనని తెలిపారు. కాగా, పవన్ కళ్యాణ్పై జగన్ వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని కూడా ఉండవల్లి తప్పుబట్టారు. జగన్ తీరు సరికాదన్నారు.