బాబుకు మోడీ పెద్ద షాక్?;ఢిల్లీవర్గాల నుంచి నాకొచ్చిన సమాచారం:ఉండవల్లి
సుదీర్ఘ విరామం తరువాత ఇటీవల ప్రధాని మోడీ,ముఖ్యమంత్రి చంద్రబాబు భేటి అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో చంద్రబాబుకు ప్రధాని మోడీ ఊహించని పెద్ద షాక్ ఇచ్చారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. తనకు ఈ సమాచారం ఢిల్లీ నుంచి అందిందని ఆయన చెబుతున్నారు...రాజమండ్రిలో ఒక లోకల్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖి సందర్భంగా ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.
దాదాపు ఏడాదిన్నర విరామం తరువాత...కొత్త సంవత్సరం ఆరంభంలో...జనవరి 12 తేదీన ప్రధాని మోడీతో ఎపి సిఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో తాను ప్రధానిని రాష్ట్రానికి అవసరమైన సాయం గురించి అడుగగా ఆయన హామీ ఇచ్చారని చంద్రబాబు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీలో అంతకుమించి మరేదో జరిగిందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారు. పైగా ఆ మరేదోకు సంబంధించిన కొంత సమాచారం తనకు ఢిల్లీ నుంచి వచ్చిందంటున్నారు...దీంతో సహజంగానే ఉండవల్లి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
చంద్రబాబుకు మోడీ షాక్?...నిజమా?...
రాజమండ్రి లోకల్ ఛానెల్ లో మోడి-చంద్రబాబు భేటి గురించిన ప్రశ్నకు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చిన సమాధానం తాజా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో త్రిబుల్ తలాఖ్ విషయమై చంద్రబాబుతో చర్చించిన అనంతరం మోడి సమావేశం చివరలో చంద్రబాబుకు చాలా పెద్ద షాక్ ఇచ్చినట్లు తనకు అనిపిస్తోందన్నారు. ఢిల్లీ వర్గాల నుంచి తనకు అందిన సమాచారం...ప్రధాని మోడీతో భేటీ తరువాత చంద్రబాబు మొహం చూస్తే అలాంటిది ఏదో జరిగినట్లే తనకు అనిపించిందని ఉండవల్లి ముక్తాయించారు. ఇంతకీ మోడి చంద్రబాబుకు ఇచ్చిన ఆ షాక్ ఏమిటి?
మోడీ ఇచ్చిన షాక్...ఇదేనంట...
ఆ షాక్ ఏమిటంటే, వచ్చే ఎన్నికల్లో ఏపిలోని లోక్ సభ స్దానాలన్నీ బిజెపికి అప్పగించి శాసనసభ స్ధానాలు అన్నింటిలో టిడిపి పోటీ చేసుకోవచ్చని చంద్రబాబుకు మోడి ప్రతిపాదించారట. దాంతో చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలినట్లయి ఉండొచ్చని తాను అనుకుంటున్నానన్నారు. అయితే ఇవన్నీ ఎవరో చెబితే అలా అంట..ఇలా అంట...అనుకోవడమే కానీ వాస్తవంగా లోపల జరిగింది ఇదీ అని మనం చెప్పలేమని ఉండవల్లి వివరించారు. మోడి తనను హామీ అడిగిన విషయంతో షాక్ గురైన చంద్రబాబు వెంటనే తేరుకోలేని పరిస్థితుల్లో...మీ ప్రతిపాదనపై ఆలోచించుకుని చెబుతాను అని చెప్పి బయటకు వచ్చేసి ఉండొచ్చని, ఆయన ముఖం చూస్తే తనకు అదే అనిపించిందని ఉండవల్లి చెప్పారు.
ఢిల్లీ నుంచి...వచ్చిన సమాచారం...
అయితే ఈ మాటలు కేవలం తాను ఊహించి చెప్పడం లేదని...ఈ సమాచారం తనకు ఢిల్లీ వర్గాల నుంచి అందిందని చెప్పడం ద్వారా ఉండవల్లి తన వ్యాఖ్యలకు ప్రాధాన్యత పెంచుకున్నట్లయింది...దీన్ని బట్టి ఈ సమాచారంలో విశ్వసనీయత ఎంతో మీరే నిర్ణయించుకోండి అన్నట్లుగా ఉండవల్లి మాట్లాడారు.
మోడీ ముందు...ప్రణమిల్లుతున్నట్లు...
మోడీ-చంద్రబాబు భేటీ విషయమై మరో ప్రశ్నకు ఉండవల్లి సమాధానమిస్తూ చంద్రబాబు ఎందుకో మోడి ముందు ప్రణమిల్లుతున్నట్లు తనకు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. అలాగే చంద్రబాబు చేస్తున్న అప్పుల వల్ల ఏపిలో ప్రజల జీవనం చాలా ఖరీదైపోతోందని విమర్శించారు. అప్పుల వల్ల ఏపిలో ప్రజల జీవనవ్యయం చాలా కాస్ట్లీగా అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్నాటకలతో పోలిస్తే డీజల్ లీటర్ ధర ఎపిలో ఏడు రూపాయలు ఎక్కువగా ఉందని చెప్పారు.
జగన్ హామీలు...మోతాదుకు మించి...
న్యాయవ్యవస్ధపై రాజకీయ జోక్యం లేకపోతే జగన్ కేసు నిలబడే అవకాశం లేదని ఒక లాయర్ గా చెబుతున్నానన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ మోతాదుకు మించి హామీలు ఇస్తున్నట్లు తన అభిప్రాయమని ఉండవల్లి చెప్పారు. ఇక చంద్రబాబు మాయలు చేయటానికే అలవాటు పడ్డారని, చంద్రబాబు మాటల్లో నిజాయితీ కనిపించటం లేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఏదేమైనా మోడీ-చంద్రబాబు భేటీపై ఉండవల్లి పేల్చిన బాంబు తాజా రాజకీయాల్లో కలకలం రేపడంతో పాటు పెద్ద చర్చనీయాంశంగా మారింది.