పవన్ కల్యాణ్ ఫెయిల్యూర్.. ఏపీలో కమ్మ, రెడ్లదే ఆధిపత్యం.. సినిమాలపై ముందే చెప్పానన్న ఉండవల్లి
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటి నుంచీ రెండు కులాల ఆధిపత్యమే కొనసాగుతున్నదని, బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నా ఓటు బ్యాంకుగా మాత్రం బలోపేతం కాలేకపోయారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గురువారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన... చిరంజీవి ప్రజారాజ్యం, పవన్ కల్యాణ్ జనసేన ప్రస్థానాన్ని ఏపీలోని ఇతర కులాలతో పోల్చుతూ, సినిమాల్లోకి పవన్ రీఎంట్రీపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి ఏమన్నారంటే..
ఉత్తరాది తరహాలో..
‘‘ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీల నుంచి బలమైన నాయకులు పుట్టుకొచ్చి, అధికారాన్ని కూడా చేపట్టారు. ఏపీలో మాత్రం బీసీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు పెద్దగా జరగలేదు. నిజానికి అలా చేయగలిగిన నేతలు కూడా మన దగ్గర రాలేదు. బీసీలు కాకున్నా కాపుల నుంచి మాత్రం కొంత కదలిక వచ్చింది. ఏపీలో కమ్మ, రెడ్లను కలిపితే ఎంతుంటారో కాపుల జనాభా అంతుంటుంది. ఆ కులం నుంచి పార్టీలు స్థాపించిన చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫెయిలయ్యారు. ఏపీలో కులాలపై ఈమధ్య కాలంలో మంచి పరిశోధనలొచ్చాయి. నేను కూడా పుస్తకం వేద్దామనుకునేలోపే కమ్మ వర్సెస్ రెడ్డి అంటూ రాజధాని వివాదం తెరపైకి రావడంతో ఆగిపోయాను.
పవన్కు ముందే చెప్పాను..
నటుడిగా పవన్ కల్యాణ్ కు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మేం మొట్టమొదటిసారి కలిసినరోజే ఒక విషయం స్పష్టంగా చెప్పాను. ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాలు ఆపొద్దని, రాజకీయాలతోపాటు వాటికీ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాను. నా మాటలకు పవన్ స్పందిస్తూ.. రెండిటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమని, పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు. కానీ..
ఇప్పుడెందుకొచ్చారు?
ఒకప్పుడు సినిమాలను వదులుకుని పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితం అవుతాన్న పవన్ కల్యాణ్ ఇవాళ మళ్లీ సినిమాలు చేస్తుండటం చాలా సంతోషకరం. బహుశా ఆరోజుల్లో తాను సీఎం అయిపోతానేమోనని అనుకోబట్టే సినిమాలకు దూరంగా ఉండాలని పవన్ నిర్ణయించుకుని ఉండొచ్చు. ఇవాళ మరో నాలుగేళ్ల దాకా సీఎం సీటు ఖాళీగా లేదుకాబట్టి పవన్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఉండొచ్చు. ఏదేమైనా ఆయన సినిమాలు చేయడం మంచివిషయమే.
బాబు బాటలో పవన్
బీజేపీతో జనసేన పార్టీ పొత్తుపై చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. వాళ్లిద్దరి కలయికకు సైద్ధాంతిక ప్రాతిపదికఏదీ కనిపించడంలేదు. నావరకైతే పవన్.. చంద్రబాబును ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు ఒక ఎన్నికల్లో కమ్యూనిస్టులతో, మరో ఎన్నికల్లో బీజేపీతో.. ఇలా పొత్తులు మార్చుతూ ఉంటాడు. పవన్ అదే మోడల్ ఫాలో అవుతున్నట్లున్నాడు. అయితే జనసేన అధికారంలో లేదుకాబట్టి పవన్ కు ఇంకా ఫ్లెక్సిబులిటీ ఎక్కువుంటుంది.
ఏపీలో ఆ రెండు కులాలే..
తెలంగాణను పక్కనపెట్టి 1952 నుంచి లెక్కలు తీస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటిదాకా మొత్తం 2270 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. రిజర్వుడు స్థానాలు వదిలేస్తే, అందులో 1144 మంది అంటే.. 50.39 శాతం మంది కమ్మ, రెడ్డి కులస్తులే(27 శాతం రెడ్లు, 22 శాతం కమ్మ) ఉన్నారు. కులం ఫీలింగ్ ఉండటం తప్పుకాదు కానీ.. డబ్బున్నవాళ్లలో కులం ఫీలింగొస్తేనే సమాజానికి ప్రమాదం. డబ్బున్నవాళ్లు తాము మాత్రమే బాగుండాలని భావిస్తే.. మిగతా కులాలవాళ్లు పురోగతి ఆగేప్రమాదముంది''అని ఉండవల్లి అరుణ్ కుమార్ వివరించారు.